అమెజాన్, జె.పి. మోర్గాన్ వంటి అగ్రశ్రేణి గ్లోబల్ కంపెనీలలో అద్భుతమైన కార్పొరేట్ కెరీర్.. చేతినిండా జీతం, సమాజంలో ఉన్నతమైన హోదా. ఎవరికైనా ఇంతకన్నా కావాల్సిందేముంటుంది. కానీ ఆమెకు ఇవేవీ సంతృప్తినివ్వలేదు. కాలగర్భంలో కలిసిపోతున్న పురాతన ఆలయాల చరిత్రను, ఆ కథలను ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నారు. అయితే సమాజం, తన తోటి వారు హేళన చేసినా లెక్కచేయకుండా ముందుకు సాగారు. తక్కువ టైమ్లోనే ‘ది టెంపుల్ గర్ల్’గా పేరు తెచ్చుకున్నారు. అంతకుమించి లక్షలాది మంది మనసుదోచుకున్నారు. ఆమే నమ్రతా మోహన్.
కర్ణాటకలోని మంగళూరుకు చెందిన నమ్రతా మోహన్కు కార్పొరేట్ రంగంలో దాదాపు పద్నాలుగేళ్ల అనుభవం ఉంది. సిటీ బ్యాంక్, జేపీ మోర్గాన్, వాల్ట్ డిస్నీ వంటి అగ్రశ్రేణి మల్టీ నేషనల్ కంపెనీలలో నమ్రత కీలక బాధ్యతలు నిర్వహించారు. అమెజాన్ సంస్థలో అత్యున్నత హోదాలో పనిచేశారు. అలా కెరీర్ పరంగా నమ్రత ఎంతో విజయవంతమైనప్పటికీ, తన మనసులో ఎక్కడో ఏదో వెలితి ఉండేది. దాంతో ఎంతోమంది కలలుగనే కొలువునుంచి బైటికి వచ్చారు. దేవాలయాలను సందర్శించినపుడు తనకు కలిగిన సంతృప్తి, పరిపూర్ణత ఆమెకు ఆనందాన్నిచ్చాయి. అలా పెళ్లయిన తర్వాత తన భర్తతో కలిసి చేసిన పవిత్ర చార్ ధామ్ యాత్ర నమ్రత జీవితాన్ని మలుపు తిప్పింది.
12 ఏళ్లుగా తన భర్త సహకారంతో భారతదేశంలోని వందలాది పురాతన ఆలయాలను సందర్శించారు. అయితే, ఆ ఆలయాల వెనుక ఉన్న అసలైన చరిత్ర, శిల్పకళా చాతుర్యం, ఆచారాల వెనుక ఉన్న శాస్త్రీయత సాధారణ ప్రజలకు చేరడం లేదని ఆమె గ్రహించారు. దానివల్ల నేటి తరానికి ఆలయాలకు మధ్య దూరం పెరుగుతోందని భావించి.. ఆ గ్యాప్ని తగ్గించడమే ధ్యేయంగా గతేడాది మే నెలలో ఆమె చేస్తున్న అమెజాన్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. పూర్తిగా ఆలయాల చరిత్రను, కథలను డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరవేసే పనిలో నిమగ్నమయ్యారు.


