‘‘సీబీఐ దాడులు చేయబోతుంది.. సిద్ధంగా ఉండండి’’ | Karnataka Chief Minister warns Congress MLAs | Sakshi
Sakshi News home page

‘‘సీబీఐ దాడులు చేయబోతుంది.. సిద్ధంగా ఉండండి’’

Sep 9 2026 9:05 PM | Updated on Sep 9 2026 9:05 PM

Karnataka Chief Minister warns Congress MLAs

బెంగళూరు: కేంద్ర దర్యాప్తు సంస్థల (సీబీఐ, ఈడీ వంటివి) దాడులకు సిద్ధంగా ఉండాలని తమ రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హెచ్చరించారు. ప్రజా పనుల శాఖ మంత్రి సతీశ్ జార్కిహోళిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులను డీకే శివకుమార్ ‘‘లక్ష్యంగా చేసుకున్నవి’’, ‘‘రాజకీయ ప్రేరేపితమైనవి’’గా అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ, కర్ణాటక ప్రభుత్వం ఆయనకు 100 శాతం అండగా ఉంటాయని చెప్పారు.

సతీశ్ జార్కిహోళిపై దాడులు జరుగుతాయని ముందే ఊహించినట్లు డీకే శివకుమార్‌ తెలిపారు. ‘‘కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేయవచ్చని నా మంత్రులు, ఎమ్మెల్యేలను సిద్ధంగా ఉండాలని హెచ్చరించాను. దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు, మంత్రులపై దాడులు జరుగుతాయని నేను భావిస్తున్నాను? దర్యాప్తునకు మేము భయపడము. అయితే తప్పుడు ఆరోపణలు చేయడం, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడాన్ని మేము ఖండిస్తున్నాం’’ అని ఆయన అన్నారు.

బీజేపీ నేతలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎందుకు దాడులు చేయడం లేదని శివకుమార్ ప్రశ్నించారు. ‘‘భోవి డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో జరిగిన కుంభకోణం లేదా బీజేపీ నేతలు ప్రమేయం ఉన్న ఇతర కుంభకోణాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎందుకు దర్యాప్తు చేపట్టలేదు?’’ అని ఆయన ప్రశ్నించారు.

దృష్టి మళ్లించేందుకే
సెప్టెంబర్ 10న తమ ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకోబోతున్న సమయంలో ఈ దాడులు జరిగాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ 100 రోజుల్లో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరించే ప్రయత్నాలకు అడ్డంకులు సృష్టించేందుకే దాడులను స్పష్టంగా రాజకీయ ఉద్దేశంతో నిర్వహించారు అని ఆయన అన్నారు.

‘‘మా పార్టీ, ప్రభుత్వాన్ని అన్ని వైపుల నుంచి లక్ష్యంగా చేసుకుంటున్నారు. మా ప్రభుత్వం సాధించిన విజయాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ దాడులు జరిగాయి’’ అని ఆయన అన్నారు. సతీశ్ జార్కిహోళి కుటుంబ సభ్యులు, సహచరుల విషయంలో తాను హామీ ఇవ్వలేనని శివకుమార్ తెలిపారు. అయితే జార్కిహోళి నిజాయితీగల వ్యక్తి అని తనకు నమ్మకం ఉందని, కేంద్ర దర్యాప్తు సంస్థ ముందు ఆయన తనను తాను సమర్థించుకుంటారని చెప్పారు.

‘‘ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయి. అవి విదేశాల్లో ఉన్నా కూడా అది చట్టవిరుద్ధం కాదు. ఆయన తగిన పత్రాలను సమర్పించి తనను తాను సమర్థించుకుంటారు’’ అని శివకుమార్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement