సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై వస్తున్న రాజకీయ విమర్శలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్కు చెడు జరగాలని కాంగ్రెస్ ఎప్పుడూ కోరుకోలేదని.. ఇకపై కూడా కోరుకోదని స్పష్టం చేశారు. కేసీఆర్ ఆరోగ్యం పాడవ్వాలని ఎవరు కోరుకుంటున్నారని, ఆయన ద్వారా ఎవరు లబ్ధి పొందాలని చూస్తున్నారని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విషయంలో జరుగుతున్న రాజకీయ విమర్శల నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ మరణాన్ని కాంగ్రెస్ కోరుకుంటోందన్న ప్రచారాన్ని ఖండించారు. ప్రతిపక్ష నాయకులను కూడా గౌరవించే సంస్కృతి కాంగ్రెస్దని స్పష్టం చేశారు. కేసీఆర్కు చెడు జరగాలని కాంగ్రెస్ కోరుకోవడం లేదని మరోసారి తేల్చిచెప్పారు.
కేసీఆర్ గాయపడిన సమయంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. అధికారులను అప్రమత్తం చేసి కేసీఆర్కు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారని, ఆయన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని కూడా సూచించారని తెలిపారు. అలాంటి తమ పార్టీపై కేసీఆర్ ఆరోగ్యం విషయంలో నిందలు వేయడం సరికాదన్నారు. వారి ఇంటి గొడవలను కాంగ్రెస్కు ఆపాదిస్తున్నారు అంటూ విమర్శలు చేశారు. అలాగే, ప్రతిపక్ష నాయకుడు నూరేళ్లు బతకాలని కోరుకుంటాం. కేసీఆర్ విషయంలో మా ఎమ్మెల్యే బాధతో మాట్లాడారు. మా పార్టీ షాద్నగర్ ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డి అభిమాని. అందుకే రేవంత్ రెడ్డిని తిడుతుంటే బాధతో కేసీఆర్పై అలా మాట్లాడారు. స్పీకర్ పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలు చాలా దారుణం’ అని వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ సంస్కృతికి వాజ్పేయి, జైపాల్ రెడ్డి ఉదాహరణలు. వాజ్పేయి ఆరోగ్యం బాగోలేకపోతే అమెరికాకు పంపించి చికిత్స చేయించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. జైపాల్ రెడ్డికి బైపాస్ సర్జరీ చేయించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితులకు క్షమాభిక్ష విషయంలో కాంగ్రెస్ కుటుంబం మానవతా దృక్పథాన్ని చూపింది. ఇలాంటి రాజకీయ సంస్కృతి మంచిది కాదు. దళితులకు అత్యున్నత పదవులు ఇచ్చి గౌరవించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది’ అని అన్నారు.
ఇదీ చదవండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సస్పెండ్


