లక్నో: బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ను మళ్లీ పార్టీలోకి తీసుకోవడానికి సిద్ధమయ్యారు. అయితే, ఆకాశ్ రాజకీయ భవిష్యత్పై కఠిన షరతు విధించారు. ఆకాశ్కు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలంటే.. ఆయన మామ, రాజ్యసభ మాజీ ఎంపీ అశోక్ సిద్ధార్థ్ పూర్తిగా రాజకీయాల నుంచి రిటైర్ అవ్వాలంటూ కండీషన్ పెట్టారు.
ఆయన రిటైర్మెంట్ తర్వాతే ఆకాష్ ఆనంద్కు బాధ్యతలు అప్పగించే విషయాన్ని పరిశీలిస్తామంటూ మాయావతి తేల్చి చెప్పారు. తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ను ఇటీవల కీలక పదవుల నుంచి తప్పించిన బీఎస్పీ అధినేత్రి.. ఆకాశ్ ఆనంద్ ఇంకా పరిణతి సాధించాల్సి ఉందని చెప్పిన సంగతి తెలిసిందే. అశోక్ సిద్ధార్థ్ రాజకీయాల నుంచి పూర్తిగా సన్యాసం తీసుకోవాలి. అంటే కేవలం పదవీ విరమణ చేయడం కాదు.. రాజకీయాలకు పూర్తిగా దూరం కావాలంటూ మాయావతి ఎక్స్లో పోస్ట్ చేశారు.
అశోక్ సిద్ధార్థ్ పార్టీ లక్యాల కంటే తన వ్యక్తిగత, కుటుంబ ప్రయోజనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని.. దాని పరిణామాలను ఆయనతో పాటు ఆకాశ్ ఆనంద్ కూడా అనుభవించాల్సి వచ్చిందని మాయావతి అన్నారు. మాయావతి సోదరుడు ఆనంద్ కుమార్ కుమారుడైన ఆకాశ్ ఆనంద్ను గతంలో ఆమె రాజకీయ వారసుడిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే 2024 నుంచి ఆయనను పలుమార్లు పార్టీ బాధ్యతల నుంచి తొలగించడం, మళ్లీ నియమించడం జరుగుతోంది. ఆయన మామ అశోక్ సిద్ధార్థ పరిస్థితి కూడా ఇంతే.. సిద్ధార్థ్ను 2025లో పార్టీ నుంచి పూర్తిగా బహిష్కరించారు. ఆ తర్వాత మళ్లీ చేర్చుకున్నారు. ఇటీవల మాయావతి మాట్లాడుతూ.. ఆకాశ్ ఆనంద్ పార్టీ నాయకుడిగా కాకుండా సాధారణ కార్యకర్తగా మాత్రమే కొనసాగవచ్చని తెలిపారు.
అల్లుడు ఆకాశ్ ఆనంద్ భవిష్యత్తును కాపాడేందుకు అశోక్ సిద్ధార్థ్కు ఇంకా ఒక అవకాశం ఉంది. ఆయన తన రాజకీయ ఆకాంక్షలను వదులుకుని, వ్యక్తిగత ప్రయోజనాలకు అతీతంగా నిలిచి రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవాలి. అప్పుడే ఆకాశ్ ఆనంద్ పార్టీలో స్వేచ్ఛగా పనిచేయగలరు. ఆ తర్వాతే పార్టీ ఆయనకు తిరిగి బాధ్యతలు అప్పగించే విషయాన్ని పార్టీ పరిశీలిస్తుంది. దీనివల్ల ఆయన పార్టీలో చురుకైన పాత్ర పోషించగలుగుతారు. పార్టీలో అందరి అభిప్రాయం కూడా ఇదే" అని మాయావతి తన పోస్టులో రాసుకొచ్చారు.
ఇదీ చదవండి: ‘‘మీరంతా సల్లబడేటట్టు చేస్తా.. జాగ్రత్త’’


