సహరాన్పూర్: ఉత్తరప్రదేశ్లో వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని, ఇందుకోసం అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) లేదా మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)తో పొత్తు పెట్టుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆలిండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు.
‘ఇండియా టీవీ’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, బీజేపీని ఓడించాలనే లక్ష్యం ఉన్న వారితో పొత్తు చర్చలకు తాము సిద్ధమని తెలిపారు. యూపీ ఎన్నికల్లో ఏఐఎంఐఎం పోటీ చేయడంపై విపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. ‘మేము ఎన్నికల్లో పోటీ చేస్తే సమస్య ఏంటి? బిహార్ ఎన్నికల్లో కూడా మేము పొత్తు కోసం ప్రయత్నించి, కేవలం ఆరు సీట్లు మాత్రమే అడిగాం. కానీ వారు సిద్ధపడలేదు. యూపీలో కూడా బీజేపీని ఓడించాలంటే, కలిసి పనిచేయాలి. సీట్ల పంపకాలపై చర్చలకు మేము సిద్ధం’ అని ఆయన పేర్కొన్నారు.
బీఎస్పీ, చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలోని ఆజాద్ సమాజ్ పార్టీతో (ఏఎస్పీ) పొత్తులపై వస్తున్న ఊహాగానాలను ఒవైసీ కొట్టిపారేశారు. అయితే బీజేపీని ఓడించేందుకు కట్టుబడి ఉన్న ఎవరితోనైనా కలిసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. ముస్లింలు విద్యను అభ్యసించకూడదని బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావిస్తున్నాయని ఒవైసీ విమర్శించారు. అజాం ఖాన్కు చెందిన జౌహర్ యూనివర్సిటీపై బుల్డోజర్ చర్యలను ప్రస్తావిస్తూ, ముస్లింలకు విద్యను అందించడం ‘వికసిత్ భారత్' కల సాకారానికి తోడ్పడుతుందని అన్నారు. ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) ద్వారా ముస్లింలను లక్ష్యంగా చేసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో జరుగుతున్న పరిణామాలపై స్పందిస్తూ, 15 ఏళ్ల అధికారంలో ఉన్న పార్టీ నుంచి నేతలు ఎందుకు వెళ్తున్నారో మమతను ప్రశ్నించాలని అన్నారు.


