2027 యూపీ ఎ‍న్నికల కోసం అఖిలేశ్‌ సూపర్ ప్లాన్.. అది ఇదే.. | Akhilesh formula for the 2027 Uttar Pradesh elections | Sakshi
Sakshi News home page

2027 యూపీ ఎ‍న్నికల కోసం అఖిలేశ్‌ సూపర్ ప్లాన్.. అది ఇదే..

Jun 13 2026 9:40 PM | Updated on Jun 13 2026 9:44 PM

  Akhilesh formula for the 2027 Uttar Pradesh elections

ఉత్తరప్రదేశ్‌లో 2024 లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ పర్ఫార్మన్స్‌ను మెరుగుపరచిన సామాజిక సమీకరణ వ్యూహాన్ని మళ్లీ అమలు చేయాలనే లక్ష్యంతో అఖిలేశ్‌ యాదవ్‌ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) పనిచేస్తోంది. 2027 అసెంబ్లీ ఎన్నికల్లో పలు జనరల్‌ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి షెడ్యూల్డ్ కులాల (ఎస్‌సీ) అభ్యర్థులను బరిలోకి దింపేందుకు సిద్ధమవుతోందని పార్టీ వర్గాలు తెలిపాయి.

దీని ద్వారా పార్టీ తన పీడీఏ అంటే వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీల సామాజిక కూటమిని బలోపేతం చేయాలని చూస్తోంది. అలాగే ముఖ్యంగా పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) సాంప్రదాయ దళిత ఓటు బ్యాంకులోకి మరింత చొచ్చుకుపోవాలని ఎస్‌పీ భావిస్తోంది.

ఈ వ్యూహాన్ని తొలిసారిగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో పరీక్షించారు. అప్పట్లో ఎస్‌పీ జనరల్‌ ఫైజాబాద్ స్థానంలో షెడ్యూల్డ్ కుల నేత అవదేశ్ ప్రసాద్‌ను, జనరల్‌ మీరట్ నియోజకవర్గంలో సునితా వర్మను బరిలోకి దింపింది.

ఈ ప్రయోగం పార్టీకి సక్సెస్‌ను ఇచ్చింది. అయోధ్య ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గంలో రామాలయం అధికార పార్టీ బీజేపీకి ప్రధాన ప్రచార అంశంగా నిలిచినా, అవదేశ్ ప్రసాద్ తన భారతీయ జనతా పార్టీ ప్రత్యర్థిపై 50,000కు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. మీరట్‌లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అరుణ్ గోవిల్ సుమారు 10,000 ఓట్ల తేడాతో గెలిచి తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. 

ఎస్‌పీ ఆధిక్యం 
అయితే, ఆ నియోజకవర్గంలోని 5 అసెంబ్లీ విభాగాల్లో 4 చోట్ల ఎస్‌పీ ఆధిక్యం సాధించింది. ఆ ఫలితాల జోరుతో పార్టీ ఇప్పుడు అదే విధానాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేయాలని యోచిస్తోంది. ఎస్‌పీ జాతీయ ప్రతినిధి రాజేంద్ర చౌధరి ఈ వ్యూహాన్ని గత ఎన్నికల్లో విజయవంతంగా అమలు చేశామని ధ్రువీకరించారు.

“2022 అసెంబ్లీ ఎన్నికల్లోనూ, 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ మేము పలు షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులను జనరల్‌ స్థానాల నుంచి బరిలోకి దింపాం. ఫలితాలు అనుకూలంగా వచ్చాయి. అదే మోడల్‌ను మళ్లీ అమలు చేయవచ్చు” అని చౌధరి చెప్పారు.

ఈ ప్రయోగానికి గుర్తించిన చాలా నియోజకవర్గాలు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోనే ఉన్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. 2012 తర్వాత బీఎస్‌పీ బలహీనపడటంతో దూరమైన దళిత ఓటర్లను ఆకర్షించాలని ఎస్‌పీ ఆశిస్తోంది. అలాగే, దళిత ఓటర్లలో చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలోని ఆజాద్ సమాజ్ పార్టీ పెరుగుతున్న ప్రభావాన్ని ఎదుర్కోవడమూ ఈ వ్యూహంలో భాగమే.

సమాజ్‌వాదీ పార్టీకి 2019లో 5 లోక్‌సభ స్థానాలు ఉండేవి. 2024లో 37 స్థానాలకు చేరుకుంది. అసెంబ్లీ విభాగాల వారీ ఫలితాల ప్రకారం.. ఎస్‌పీ 184 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యర్థుల కంటే ముందంజలో నిలిచింది. 2024 ఫలితాల ఆధారంగా, పీడీఏ కూటమి మద్దతును 2027 ఎన్నికల నాటికి మరింత పెంచుకోవచ్చనే నమ్మకం ఎస్‌పీ నాయకత్వంలో పెరిగింది.

లక్నోలోని గిరి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ ‍స్టడీస్‌కు చెందిన రాజకీయ విశ్లేషకురాలు నోమిత కుమార్‌ మాట్లాడుతూ.. సాధారణ స్థానాల నుంచి షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులను బరిలోకి దింపాలన్న సమాజ్‌వాదీ పార్టీ నిర్ణయం నియోజకవర్గ స్థాయిలో దళిత ఓటర్లను బాగా సమీకరించేలా ప్రభావం చూపవచ్చని అన్నారు.

“సాధారణ స్థానాల్లో ఎస్‌సీ అభ్యర్థులను నిలబెట్టడం ఆ నియోజకవర్గాల్లో దళిత ఓటర్లను ఉత్తేజపరుస్తుంది. ముఖ్యంగా స్థానిక పోటీల్లో గుర్తింపు ప్రాతినిధ్యం కీలక అంశంగా మారినప్పుడు ఇది ప్రభావం చూపుతుంది. అయితే ముస్లింలు, ఇతర వెనుకబడిన వర్గాలు, దళితులను పీడీఏ రూపకల్పన కింద ఎంత సమర్థంగా ఏకం చేయగలదన్నదే ఎస్‌పీ  ఎన్నికల బలాన్ని నిర్ణయిస్తుంది. ఉత్తరప్రదేశ్ అంతటా పోటీతత్వాన్ని నిర్ణయించేది ఈ సమీకరణే” అని ఆమె అన్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement