సోంపేట: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలోని సోంపేట మండలం గొల్లవూరు పంచాయతీ దామోదరపురం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి వెళ్లే రోడ్డు అధ్వానంగా తయారవ్వడంతో ఓ గర్భిణి తీవ్ర రక్తస్రావానికి గురై బిడ్డను కోల్పోయింది. ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాలివీ.. వ్యాపారరీత్యా భువనేశ్వర్లో ఉంటున్న యజ్జల లోలాక్షి కుటుంబం శుక్రవారం ఏరినమ్మ పూజ నిమిత్తం స్వగ్రామం దామోదరపురం వచ్చారు.
రోడ్డు సరిగ్గా లేకపోవడంతో గర్భిణి లోలాక్షి తీవ్ర ఇబ్బందులుపడి ఇంటికి చేరుకుంది. అప్పటికే రక్తస్రావం కావడంతో ఆస్పత్రికి వెళ్లేందుకు ఆటోలకు ఫోన్చేయగా అధ్వాన రోడ్డు కారణంగా వాహనాలు పాడైపోతున్నాయని, తాము రాలేమని చెప్పారు. చివరికి ఓ వ్యక్తిని అతికష్టంమ్మీద ఒప్పించి సోంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు.
వైద్యుల సూచనతో అక్కడ నుంచి బరంపురం ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ తల్లీబిడ్డ అపస్మారక స్థితికి చేరుకున్నారు. అనంతరం.. బిడ్డ ప్రాణాలు పోయాయని, తల్లి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. బాధిత తల్లికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అత్యవసర పరిస్థితిలో కనీసం అంబులెన్స్ వాహనం కూడా రాని దుస్థితిలో రోడ్డు ఉన్నందున, ఈ మృతిని ప్రభుత్వ హత్యగా పరిగణనలోకి తీసుకుని బాధితులకు తగిన న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.


