బ్రిక్స్ దేశాల ఆర్థిక మంత్రుల తీర్మానం
ముంబై: ఎదుగుతున్న మార్కెట్లు, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ స్థాయి ఆర్థిక సంస్థల్లో మరింత ఎక్కువ ప్రాతినిథ్యం కల్పింంచాలని బ్రిక్స్ దేశాల ఆర్థిక శాఖ మంత్రులు, సెంట్రల్ బ్యాంకు గవర్నర్లు పిలుపునిచ్చారు. టారిఫ్ల విధింపు, వాణిజ్య పోకడలు ఏకపక్షంగా సాగుతూండటాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. బ్రిక్స్ దేశాల మధ్య ఆర్థిక సహకారం మరింత దృఢతరం కావాలని ఆకాంక్షించారు.
ముంబైలో శుక్రవారం ముగిసిన బ్రిక్స్ దేశాల ఆర్థిక శాఖ మంత్రులు, సెంట్రల్ బ్యాంకుల గవర్నర్ల సమావేశం ఈ మేరకు ఉమ్మడి తీర్మానం చేసింది. వ్యాపారం, పెట్టుబడులకు స్థానిక కరెన్సీలను వాడేందుకు సెంట్రల్ బ్యాంకు గవర్నర్లు మద్దతు తెలపగా... చెల్లింపులకు బ్రిక్స్ దేశాల మధ్య ప్రత్యేక వ్యవస్థలను అభివృద్ధి చేసుకోవాలని నిర్ణయించారు. భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్యం ముక్కలైపోతూండటం, రక్షణాత్మక విధానాలు, ఆర్థిక, ద్రవ్యోల్బణ సంబంధిత ఒత్తిళ్ల ఫలితంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పు ఎక్కువవుతోందని బ్రిక్స్ దేశాలు ఉమ్మడి తీర్మానంలో గుర్తించాయి.
నిర్దిష్టంగా ఏ దేశం పేరుప్రస్తావించకున్నా ఈ ముప్పు ప్రభావం మాత్రం అభివృద్ధి చెందుతున్న దేశాలపైనే ఎక్కువగా ఉందని స్పష్టం చేశాయి. డబ్ల్యూటీవో కేంద్రంగా పారదర్శక, అందరినీ కలుపుకుని పోయే, వివక్షరహిత వ్యవస్థకు బ్రిక్స్ మద్దతు తెలుపుతుందని ప్రకటించింది. అమెరికా వాణిజ్య విధానాల వల్ల ప్రపంచ వాణిజ్యం అస్తవ్యస్తమైన విషయం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. దీంతోపాటు ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు అధిపతుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా, ప్రతిభ ఆధారంగా, అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం కల్పింంచేలా ఉండాలని కూడా బ్రిక్స్ పిలుపునిచ్చింది. స్థానిక కరెన్సీల్లో రుణాలు, ప్రాజెక్టులకు సన్నద్ధత నిధులు, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించే హామీ పథకాలను పెంచాలని తీర్మానించింది.


