బిగ్ బాస్ హౌస్లోకి బాక్సింగ్ ఛాంపియన్ మేరీకోమ్ ప్రవేశించిన నాలుగు రోజులకే ఆమె మాటతీరు, వైఖరిపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. తన కష్టం, తన విజయాలు, తన బలం గురించి మేరీకోమ్ తరచూ ప్రస్తావించడం కొంతమంది ప్రేక్షకులకు అసహనం కలిగిస్తోందనే మాట వినిపిస్తోంది. ఆమె సంభాషణల్లో ‘నేను’ అనే భావన ఎక్కువగా కనిపిస్తోందంటూ పలువురు యూజర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
రీతి తివారితో జరిగిన సంభాషణలో మేరీకోమ్ ‘ప్రపంచమంతా నన్ను గుర్తుపడుతుంది. మీరు ఎవరో నాకు తెలియదు’ అని వ్యాఖ్యానించడంపై చర్చ చెలరేగుతోంది. ఈ వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒకరి గుర్తింపును ప్రశ్నించడం కంటే, ఆ మాట చెప్పిన తీరు కొంతమంది ప్రేక్షకులకు అహంకారంగా అనిపించింది. షోలో మేరీకోమ్ తన ఫిట్నెస్, శారీరక బలం గురించి కూడా మాట్లాడింది. రింగ్లో తనతో పోటీ పడటం అంత సులభం కాదని, తనతో ఎవరూ సరిపోలరని ఆమె చెప్పింది. తన విజయాలకు కఠోర శ్రమే కారణమని, ఎవరినైనా ఎత్తి విసిరేయగల శక్తి తనకు ఉందని ఆమె చెప్పినట్లు తెలిపింది.
తన పిల్లలు కూడా తనలా మారడం అంత సులభం కాదని మేరీకోమ్ వ్యాఖ్యానించింది. దీంతో ‘నా లాంటి వారు ఎవరూ లేరు’ అనే భావన ఆమె మాటల్లో కనిపిస్తోందంటూ కొంతమంది ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మేరీకోమ్ దేశానికి ఎన్నో టైటిళ్లు సాధించిన బాక్సింగ్ ఛాంపియన్. ఆమె విజయాలు, కృషిపై దేశవ్యాప్తంగా గౌరవం ఉంది. అయితే బిగ్ బాస్ వేదికపై విజయాలతో పాటు ప్రవర్తన కూడా ముఖ్యమేనని పలువురు అంటున్నారు. ప్రస్తుతం ఆమె వైఖరిని కొంతమంది యూజర్లు ‘అహంకార భావన’తో ముడిపెడుతున్నారు. రానున్న ‘వీకెండ్ కా వార్’లో ఈ అంశంపై ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
ఇదీ చదవండి: ‘ఫస్ట్లుక్’లో లాల్బాగ్చా రాజా.. జనం క్యూ..


