వినాయక చవితి సందర్భంగా దేశవ్యాప్తంగా గణేశుడి ఉత్సవాల సందడి నెలకొంది. అయితే రాజస్థాన్లోని ఓ పురాతన గణేశ ఆలయం తన ప్రత్యేక సంప్రదాయంతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సాధారణంగా దేవుడికి మొక్కులు, పూజలు, నైవేద్యాలు సమర్పిస్తుంటారు. కానీ ఇక్కడ భక్తులు తమ కోరికలు, సమస్యలు, శుభవార్తలను లేఖల రూపంలో స్వయంగా గణేశుడికి పంపిస్తారు. రోజుకు వెయ్యికి పైగా లేఖలు ఈ ఆలయానికి చేరుతుండటంతో దీనికి దేశవ్యాప్తంగా ‘లెటర్-వాలా గణేశ్ టెంపుల్’ అనే పేరు వచ్చింది.
రోజూ వెయ్యికి పైగా లేఖలు
రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్ జిల్లాలో, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన రణతంబోర్ కోటలో త్రినేత్ర గణేశ్ ఆలయం ఉంది. డిజిటల్ యుగంలో ప్రముఖ ఆలయాలు ఆన్లైన్లో పూజలు, ప్రసాద సేవలు అందిస్తున్నప్పటికీ.. ఈ ఆలయం మాత్రం చేతిరాత లేఖల సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. ప్రతిరోజూ 1,000కు పైగా లేఖలు, పోస్టుకార్డులు, ఆహ్వాన పత్రాలు ఆలయానికి వస్తుంటాయి. వాటిలో సమస్యలను వివరిస్తూ రాసిన లేఖలు, వివాహ ఆహ్వానాలు, శిశువు జననం, కొత్త వ్యాపారం ప్రారంభం, కొత్త ఇల్లు కొనుగోలు వంటి శుభ సందర్భాల సమాచారంతో కూడిన లేఖలు ఉంటాయి. కొందరు భక్తులు తమ వ్యక్తిగత సమస్యలను వివరిస్తూ దేవుని సహాయం కోరుతూ లేఖలు పంపుతారు.
కోరికలు.. కష్టాలు.. కృతజ్ఞతలు
త్రినేత్ర గణేశ్ ఆలయంలో ఈ ప్రత్యేక సంప్రదాయం చాలా కాలంగా కొనసాగుతున్నట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. భక్తులు తమ కోరికలు, సమస్యలు, కృతజ్ఞతలను వివరంగా లేఖల్లో రాస్తారు. ఆ లేఖలను ఆలయానికి చేరుకున్న తర్వాత సేకరించి గణేశుడి ముందు ఉంచుతారు. పూజా సమయంలో పూజారులు భక్తుల ప్రార్థనలను విగ్రహం ముందు చదివి వినిపిస్తారని కూడా చెబుతారు. ముఖ్యంగా కుటుంబాల్లో వివాహం నిశ్చయమైనప్పుడు మొదటి వివాహ ఆహ్వాన పత్రికను త్రినేత్ర గణేశుడికి పంపడం శుభప్రదమైన ఆచారంగా భావిస్తారు.
1300లో ఆలయ నిర్మాణం
త్రినేత్ర గణేశ్ ఆలయం సుమారు క్రీస్తుశకం 1300 ప్రాంతంలో రాజు హమ్మీర్ దేవ్ పాలనలో నిర్మించినట్లు చెబుతారు. రణతంబోర్ కోటపై అలావుద్దీన్ ఖిల్జీ సుదీర్ఘకాలం ముట్టడి కొనసాగించిన సమయంలో హమ్మీర్ రాజుకు గణేశుడు కలలో కనిపించాడని స్థలపురాణం చెబుతోంది. మరుసటి రోజు కోట గోడపై మూడు కళ్లతో ఉన్న గణేశుడి రూపాన్ని రాజు చూశాడని, ఆ ప్రదేశంలోనే ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారని కథనం. గణేశుడికి మూడు కళ్లుండటంతోనే ఆయనను ‘త్రినేత్ర గణేశ్’గా పిలుస్తారు.
కుటుంబ సమేతంగా గణేశుడి దర్శనం
ఈ ఆలయానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. గణేశుడిని ఆయన కుటుంబ సమేతంగా పూజించే అరుదైన ఆలయాల్లో ఇది ఒకటిగా చెప్పబడుతోంది. ఇక్కడ గణేశుడితో పాటు ఆయన భార్యలు రిద్ధి, సిద్ధి, కుమారులు శుభ్, లాభ్ కూడా పూజలందుకుంటారు. అందువల్ల భక్తులకు ఈ ఆలయం ఆధ్యాత్మికంగా ప్రత్యేక ప్రాధాన్యం కలిగిన క్షేత్రంగా నిలిచింది.
ప్రపంచం నలుమూలల నుంచి లేఖలు పంపొచ్చు
భక్తులు ప్రపంచంలోని ఏ ప్రాంతం నుంచైనా తమ లేఖలను ఆలయానికి పంపవచ్చు. ఇందుకోసం Shree Trinetra Ganesh Ji Temple, Ranthambore Fort, Sawai Madhopur, Rajasthan – 322001 చిరునామాకు పోస్టు చేయవచ్చు. వివాహ ఆహ్వాన పత్రికలు లేదా కుటుంబంలోని ఇతర శుభకార్యాలకు సంబంధించిన పత్రాలను కూడా భక్తులు పంపుతుంటారు. ఆలయానికి చేరుకున్న తర్వాత వాటిని పూజారి గణేశుడి ముందు సమర్పిస్తారు.
దర్శన వేళలు.. ఎలా చేరుకోవాలి?
త్రినేత్ర గణేశ్ ఆలయానికి సమీప రైల్వే స్టేషన్ సవాయ్ మాధోపూర్ జంక్షన్. ఆలయం నుంచి ఇది సుమారు 7 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆలయానికి సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి ట్యాక్సీలు, ఆటోలు అందుబాటులో ఉంటాయి. ఆలయంలో సాధారణంగా ఉదయం 6:30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనాలు ఉంటాయి. రోజులో ప్రాతఃకాల ఆరతి, శృంగార ఆరతి, భోగ్ ఆరతి, సాయంసంధ్య ఆరతి, శయన ఆరతి వంటి పలు ఆరతులు జరుగుతాయి. గణేశుడికి బుధవారం ప్రత్యేకమైన రోజుగా భావించడంతో ఆ రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.
ఇదీ చదవండి: నీమ్ కరోలీ బాబా: ఈ నాలుగు బోధనలతో జీవితం ప్రశాంతం


