ఖైరతాబాద్ మహాగణపతి పరిసర ప్రాంతాల్లో నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు
రాక.. పోక ఇలా..
హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తుల రద్దీ పెరగడంతో ఈ నెల 12వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 11 నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ మళ్లింపు అమలు చేయనున్నట్లు ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ డి.జోయెల్ డేవిస్ తెలిపారు. ఖైరతాబాద్ చౌరస్తా నుంచి మింట్ కాంపౌండ్ వైపునకు వెళ్లే వాహనాలను నిరంకారి జంక్షన్ వైపు మళ్లిస్తారు.
సైఫాబాద్ ఓల్డ్ పీఎస్ నుంచి రాజ్దూత్ చౌరస్తా మీదుగా ఖైరతాబాద్ మహాగణపతి వైపునకు వెళ్లే వాహనాలను ఎక్బాల్ మినార్ వైపు మళ్లిస్తారు. ఎక్బాల్ మినార్ నుంచి మింట్ కాంపౌండ్ మీదుగా ఐమ్యాక్స్ వైపు ట్రాఫిక్కు అనుమతి లేదు. ఈ వాహనాలను సచివాలయ జంక్షన్ లేదా ఖైరతాబాద్ ప్లై ఓవర్ వైపు మళ్లిస్తారు. ఖైరతాబాద్ పోస్టాఫీస్ లైన్ మీదుగా రైల్వే గేటు వైపు వెళ్లే వాహనాలను లక్డీకాపూల్ వైపు మళ్లిస్తారు.
ఈ సంవత్సరం భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఖైరతాబాద్, షాదాన్ కాలేజీ, అయోధ్య, నిరంకారి, పాత సైఫాబాద్ పోలీస్స్టేషన్, మింట్ కాంపౌండ్, ఎన్టీఆర్ మార్గ్, సచివాలయం జంక్షన్, నెక్లెస్ రోటరీ, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ జాం ఏర్పడవచ్చని, అందువల్ల ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
వాహనాల పార్కింగ్
వాహనాల పార్కింగ్ కోసం నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ గార్డెన్ వైపు నుంచి వచ్చే భక్తులు రేస్ కోర్స్ రోడ్డు, ఎన్టీఆర్ ఘాట్, ఐమ్యాక్స్ పక్కన ఉన్న హెచ్ఎండీఏ మైదానం, ఐమాక్స్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో వాహనాలు పార్కు చేసుకోవాలని, ఖైరతాబాద్ జంక్షన్ వైపు నుంచి వచ్చే భక్తులు విశ్వేశ్వరయ్య భవన్ ప్రాంతంలో వాహనాలు పార్కు చేసుకోవాలని తెలిపారు.
ఇవీ చదవండి: తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు కీలక బిల్లులు..! ముందున్నవి ఇవే!


