Hyderabad: గణపయ్య భక్తులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త | Hyderabad Ganesh Festival: Tgsrtc Special Buses To Khairatabad Balapur | Sakshi
Sakshi News home page

Hyderabad: గణపయ్య భక్తులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త

Sep 12 2026 9:33 PM | Updated on Sep 12 2026 9:38 PM

Hyderabad Ganesh Festival: Tgsrtc Special Buses To Khairatabad Balapur

సాక్షి, హైదరాబాద్‌: వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ఖైరతాబాద్ మహా గణపతి, బాలాపూర్ గణేష్ మండపాలను దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం టీజీఎస్ ఆర్టీసీ భారీగా ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రకటించింది. ఈ ప్రత్యేక బస్సులు సెప్టెంబర్ 14వ తేదీ సోమవారం నుండి సెప్టెంబర్ 24వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి వెల్లడించారు. నగరంలోని ప్రధాన బస్ స్టేషన్లయిన జేబీఎస్, ఎంజీబీఎస్ మీదుగా సాగే ఈ రవాణా సౌకర్యాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఈ ప్రత్యేక బస్సులు జేబీఎస్ నుండి ప్రారంభమై ప్యాట్నీ, బాటా, బోట్ క్లబ్,  ట్యాంక్ బండ్, ఐమాక్స్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, గాంధీ భవన్, అఫ్జల్‌గంజ్, సీబీఎస్/ఎంజీబీఎస్, విమెన్స్ కాలేజ్, జె.గార్డెన్, గవర్నమెంట్ ప్రెస్, ఐ.ఎస్. సదన్, పిసల్‌బండ, మిధాని టి.షిప్, బాలాపూర్ ఎక్స్ రోడ్, శివాజీ చౌక్ల మీదుగా బాలాపూర్ గణేష్ మండపానికి చేరుకుంటాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా జేబీఎస్ వద్ద ఉదయం 6:00 గంటలకు మొదటి సర్వీస్ ప్రారంభమై రాత్రి 21:55 గంటల వరకు ప్రతి 40 నుండి 50 నిమిషాల వ్యవధితో నిరంతరాయంగా బస్సులు నడుస్తాయి.

అలాగే బాలాపూర్ గణేష్ మండపం నుండి తిరుగు ప్రయాణ బస్సులు ఉదయం 7:55 గంటలకు ప్రారంభమై రాత్రి 23:50 గంటల వరకు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. ప్రతిష్టాత్మక హైదరాబాద్ గణేష్ ఉత్సవాల వేళ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సుఖవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎండీ నాగిరెడ్డి  వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement