హైదరాబాద్: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఖైరతాబాద్ బడా గణేశ్ దర్శనానికి వచ్చే భక్తులకు అసౌకర్యాలు కలగకుండా చూసేందుకు పోలీసు అధికారులు శనివారం అన్ని ప్రధాన రహదారులను, రూట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగర జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) డి.జోయల్ డెవిస్, డీసీపీ ట్రాఫిక్ అవినాశ్ కుమార్, అడిషనల్ డీసీపీ శ్రీరాములు, ఏసీపీ ట్రాఫిక్ ఎస్.మోహన్ కుమార్, ఇతర పోలీస్ అధికారులు ఇందులో పాల్గొన్నారు.
అనంతరం జోయల్ డెవిస్ మీడియా సమావేశంలో మాట్లాడి.. బడా గణేశ్ దర్శనానికి వచ్చే భక్తులు, వాహనదారులు, సాధారణ ప్రజల సౌకర్యార్థం చేపట్టిన ట్రాఫిక్ బందోబస్తు, మార్గదర్శకాలను వివరించారు.
ముఖ్యమైన అంశాలు ట్రాఫిక్ మార్గదర్శకాలు:
దర్శన దారులు (4 ప్రధాన మార్గాలు):
1. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వైపు నుంచి.
2. ద్వారకా హోటల్ / టెలిఫోన్ భవన్ వైపు నుంచి.
3. మింట్ కాంపౌండ్ / ఐమాక్స్ ప్రసాద్ వైపు నుంచి.
4. గణేశుడి విగ్రహం వెనుక ఉన్న బస్తీ వైపు నుంచి.
పబ్లిక్ ట్రాన్స్పోర్ట్:
ఉత్సవాలు జరిగే రోజుల్లో దాదాపు 30 లక్షల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో రద్దీని నివారించేందుకు మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలి.
మెట్రో రైళ్లు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉంటాయి.
ఖైరతాబాద్ మార్గంలో రోజువారీ 2,200 ఆర్టీసీ బస్సులతో పాటు ప్రత్యేక బస్సులను కూడా ఆర్టీసీ నడుపుతోంది.
రద్దీ సమయాలు, సూచనలు:
మధ్యాహ్నం తర్వాత, వారాంతాల్లో (శని, ఆదివారాలు), సెలవు రోజుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది.
ఉదయం 6 గంటల నుంచే దర్శనం ప్రారంభమవుతుంది కాబట్టి, సాయంత్రం రద్దీని నివారించడానికి భక్తులు ఉదయం నుంచి మధ్యాహ్నం లోపలే దర్శనం పూర్తి చేసుకోవాలి.
కుదిరితే సోమవారం నుంచి శుక్రవారం మధ్య రోజులలో దర్శనానికి రావడం ఉత్తమం.
సొంత వాహనాలు & కార్ పూలింగ్:
వ్యక్తిగత వాహనాల్లో వచ్చేవారు కార్ పూలింగ్ (ఒకే కారులో కుటుంబ సభ్యులు, మిత్రులు కలసి రావడం) పాటించాలి.
కేటాయించిన పార్కింగ్ ప్రదేశాలు:
ఎన్టీఆర్ మార్గ్ / ఐమాక్స్ వైపు: ఐమాక్స్ గ్రౌండ్, హెచ్ఎమ్డీఏ లేక్ వ్యూ పార్కింగ్, ఎన్టీఆర్ పార్క్ వెనుక భాగంలోని ఈ-రేసింగ్ (E-Racing) గ్రౌండ్.
నెక్లెస్ రోడ్ వైపు: పైన పేర్కొన్నవి నిండితే నెక్లెస్ రోడ్డులోని మక్తా పార్కింగ్ స్థలం.
మెట్రో / వివి స్టాచ్యూ వైపు: విశ్వేశ్వరయ్య భవన్ (ఇక్కడ దిగిన వారు రోడ్డు దాటాల్సి ఉంటుంది).
టెలిఫోన్ భవన్ వైపు: పరిమిత పార్కింగ్ మాత్రమే కలదు. (భక్తులు వీలైనంత వరకు ఎన్టీఆర్ మార్గ్ వైపు ఉన్న పార్కింగ్ స్థలాలనే ఉపయోగించుకోవాలి).
ఆటోలు, ఓలా, ఊబర్ (పికప్ / డ్రాపింగ్ పాయింట్స్):
వీవీ స్టాచ్యూ నుంచి నిరంకారీ మధ్య ప్రధాన రహదారిపై ఎక్కడం/దిగడం వల్ల ట్రాఫిక్ స్తంభిస్తుంది.
అందువల్ల ఆటోలు, క్యాబ్ల డ్రాపింగ్, పికప్లను ఎంఎంటీఎస్ (MMTS) స్టేషన్ పక్కన ఉన్న ఓపెన్ గ్రౌండ్లోనే చేసుకోవాలి.
మెట్రో ప్రయాణికులకు ప్రత్యేక సూచన
మెట్రోలో వచ్చే భక్తులు దిగిన తర్వాత ఖైరతాబాద్ బడా గణేశ్ ఉన్న వైపే (గణేశ్ పండల్ వైపు) నిష్క్రమించాలి.
పొరపాటున 'సెవెన్ టెంపుల్స్' వైపు దిగితే రోడ్డు దాటాల్సి వచ్చి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయి. భక్తుల సౌకర్యార్థం అక్కడ సైనేజ్ బోర్డులు, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్, పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉంటారు.
వాహనాల మళ్లింపు (Traffic Diversions):
సాధారణ భక్తుల వాహనాలకు రాజ్దూత్ లేన్, ద్వారకా హోటల్ వైపు నుంచి లోపలికి అనుమతి ఉండదు. వాటిని టెలిఫోన్ భవన్ వైపు మళ్లిస్తారు.
మింట్ లేన్ లోపలికి వాహనాలను అనుమతించరు. వాటిని సెక్రటరియేట్ వైపు మళ్లిస్తారు.
ఐమాక్స్ థియేటర్ దాటి బడా గణేశ్ వైపు అనుమతి లేదు. డైరెక్ట్గా నెక్లెస్ రోడ్ లేదా ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు మళ్లిస్తారు.
రాజీవ్ గాంధీ స్టాచ్యూ నుంచి రైల్వే క్రాసింగ్ దాటి అనుమతి ఉండదు. డైరెక్ట్గా నిరంకారీ వైపు మళ్లిస్తారు.
పాదచారుల క్యూ లైన్లు & బారికేడింగ్:
కాలినడకన వచ్చే భక్తుల కోసం ఎంట్రీ, ఎగ్జిట్లకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. వాహనాలు వెళ్లే క్యారేజ్వే పైకి పాదచారులు రాకుండా చర్యలు తీసుకున్నారు.
ఆర్ అండ్ బీ (R&B) ఆధ్వర్యంలో మెష్ బారికేడింగ్ పనులు జరుగుతున్నాయి. ఖైరతాబాద్ జంక్షన్, షాదాన్ యూటర్న్, నిరంకారీ వద్ద మాత్రమే రోడ్డు దాటేందుకు (Pedestrian Crossing) అనుమతి ఉంటుంది.
బందోబస్తు & భద్రత:
ఐఆర్ సిబ్బంది, పుషింగ్ టీమ్స్తో పాటు దాదాపు 500 మంది పోలీస్ సిబ్బందిని ప్రధాన జంక్షన్లు (వీవీ స్టాచ్యూ, రాజీవ్ గాంధీ స్టాచ్యూ, షాదాన్, నిరంకారీ, ద్వారకా హోటల్, టెలిఫోన్ భవన్, ఇక్బాల్ మినార్, తెలంగాణ తల్లి జంక్షన్, సెక్రటరియేట్, ఎన్టీఆర్ మార్గ్ మొదలైన చోక్ పాయింట్ల వద్ద) బందోబస్తులో డిప్లాయ్ చేస్తున్నారు.
ముఖ్య గమనిక (దర్శనం ముగింపు తేదీ):
సెప్టెంబర్ 23వ తేదీతోనే బడా గణేశ్ దర్శనం పూర్తవుతుంది.
24వ తేదీన దర్శనానికి ఎలాంటి అనుమతి ఉండదు.


