హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి శనివారం వినాయక చవితి, నిమజ్జనం ఏర్పాట్ల సమీక్షలో పాల్గొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత సంప్రదాయాన్ని పునర్దుద్ధరించామని తెలిపారు. సమస్యలు తెలుసుకునేందుకు స్వయంగా తానే సమీక్ష నిర్వహిస్తున్నానని అన్నారు.
‘‘మండపాలకు అతిథులను ఆహ్వానిస్తే నిర్వాహకులు ఆ వివరాలు స్థానిక కమిషనరేట్ కు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఊహించని పరిణామాలు జరగినపుడు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ఆ సమాచారం ఉపయోగపడుతుంది. దేశంలో ఎక్కడాలేని విధంగా మన రాష్ట్రంలో గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. మండప నిర్వాహకులు సంబంధిత అధికారుల వద్ద దరఖాస్తు చేసుకుని ఉచిత విద్యుత్ పొందాలి.
ఎక్కడెక్కడ మండపాలు ఏర్పాటు చేస్తున్నారో ముందుగానే సమాచారం అందిస్తే పోలీసులకు ట్రాఫిక్, బందోబస్తు నిర్వహణకు సులభంగా ఉంటుంది. అభివృద్ధి చేస్తున్న చెరువుల వద్ద బతుకమ్మలకు ఏర్పాటు చేసినట్లే గణేశ్ నిమజ్జనాలకు అనుగుణంగా నిర్మాణ సమయంలోనే జాగ్రత్తలు తీసుకోవాలి. చెరువుల వద్ద చుట్టూ క్రేన్స్ ఏర్పాటుకు అనుగుణంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి.
ఉత్సవాలు ముగిసే వరకు మున్సిపల్, పోలీస్ శాఖ నిరంతర పర్యవేక్షణ చేయాలి. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసుకోవాలి. పర్యవేక్షణ, సమన్వయానికి ప్రత్యేక అధికారులను నియమించాలి. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత్త వహించాలి. ఇందుకు నిర్వాహకుల నుంచి సహకారం ఉండాలి. సమస్యలు ఏమున్నా పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’ అని రేవంత్ రెడ్డి తెలిపారు.


