స్మార్ట్ఫోన్ యుగంలో పోర్నోగ్రఫీ సైట్లతో అశ్లీలత చేతుల్లోకి చేరింది. మైనర్ల నుంచి మొదలుకొని నడివయస్సు వరకు చాలామంది పోర్నోగ్రఫీకి బానిసగా మారుతున్నారు. కొందరు చైల్డ్ పోర్నోగ్రఫీ చూస్తూ జైలు పాలవుతున్నారు. ఈ ఏడాది మంచిర్యాల పోలీస్స్టేషన్ పరిధిలో చైల్డ్పోర్నోగ్రఫీ వీడియోలు చూసి, ఇతరులకు షేర్ చేసినందుకు ఐదుగురిపై కేసు నమోదైంది. వీరిలో ముగ్గురు మైనర్లు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. - మంచిర్యాల జిల్లా
అశ్లీల వెబ్సైట్లపై ప్రత్యేక నిఘా..
అశ్లీల వెబ్సైట్లు, టెలిగ్రామ్, సోషల్ మీడియా ఫ్లాట్ఫాంలపై అమెరికాకు చెందిన యూనైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ అనే స్వచ్ఛంద సంస్థ (ఎన్సీఎంఈసీ), నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లాయిటెడ్ చిల్ర్డన్ అనే ప్రత్యేక విభాగం ప్రత్యేక నిఘా పెడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా చిన్నారులపై జరిగే అశ్లీల దాడులు, చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు, ఫొటోలు ఎవరు చూస్తున్నారు, ఎవరు షేర్ చేస్తున్నారో గుర్తించి ఆయా రాష్ట్రాల పోలీసులకు సమచారం అందిస్తోంది. స్థానిక పోలీస్స్టేషన్లకు పోర్నోగ్రఫీ వీడియోలు చూసిన, షేర్ చేసిన వారి వివరాలు అందించి కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. చట్ట ప్రకారం ప్రైవేటుగా చూడడం నేరం కాకపోయిన, చూసి ఇతరులకు షేర్ చేయడం ఐటీ యాక్ట్ 67 ప్రకారం నేరమవుతుంది. ఒకవేళ ఆ వీడియోల్లో మైనర్లు ఉంటే అది ఐటీ యాక్ట్ 67–బీ, పోక్సో చట్టం ప్రకారం ఏడేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంటుంది.
యువత పక్కదారి..
విద్యార్థి దశలోనే అరచేతిలో ఉన్న సెల్ఫోన్ వారిని నేరాల్లోకి నెడుతోంది. తాజాగా జిల్లా కేంద్రంలో ఆండాలమ్మ కాలనికి చెందిన ఓ మైనర్ బాలుడు ఫోర్న్ వీడియోలు చూసి మరో మైనర్ బాలికను వేధించినందుకు సదరు బాలిక దగ్గరి బంధువు బాలుడిని మందలించాడు. దీంతో బాలుడు మద్యం మత్తులో మందలించిన వ్యక్తి గొంతు కోసి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. సెల్ఫోన్లలో లైంగిక, హింసాత్మక ఆంశాలు కౌమర దశలో ఉన్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీడియోలు చూస్తే ఎవరికి తెలుస్తుందిలే అన్న భ్రమలో యువత ఉంటున్నారు. కానీ పోర్నోగ్రఫీ వెబ్సైట్లు ఎవరు చూస్తున్నారు.. ఎవరికి షేర్ చేస్తున్నారు.. ఎవరు డౌన్లోడ్ చేస్తున్నారో ఎన్సీఎంఈసీ ఇట్టే పట్టేస్తోంది. తమ పిల్లలు సెల్ఫోన్లో ఏం చూస్తున్నారో తల్లిదండ్రులు ఓ కన్నేయాలని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు.
సర్వర్లు బ్లాక్..
పోర్న్ వెబ్సైట్లపై ఫిర్యాదులు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం వాటిని నిషేధించి బ్లాక్ చేయిస్తోంది. నిర్వాహకులు బ్లాక్ అయిన వెబ్సైట్ పేరును పోలిన లేదా దాని చివర 1, 2 లాంటి అంకెలు చేర్చి మరో వెబ్సైట్ను ప్రారంభిస్తున్నారు. ఈ తరహా వెబ్సైట్లను హోస్ట్ చేస్తున్న సర్వర్లు విదేశాల్లో ఉన్నవే కావడంతో వెబ్సైట్ల నిర్వాహకుల వివరాలు తెలుసుకోవడానికి, వారిపై చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండడం లేదని ఓ పోలీస్ అధికారి చెప్పడం గమనార్హం.
వెంటనే తెలిసిపోతుంది..
పోర్నోగ్రఫీ వీడియోలు చూడడం నేరమని తెలియక యువత చూస్తున్నారు. కేంద్రం నుంచి అందించిన సమాచారం ఆధారంగా వీడియోలు చూస్తున్న వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. జిల్లా కేంద్రంలో ఐదు కేసులు నమోదు కాగా అందులో ముగ్గురు మైనర్లు ఉన్నారు. అశ్లీల వెబ్సైట్లపై పూర్తి స్థాయి నిఘా ఉంది.
– ప్రమోద్రావు, సీఐ, మంచిర్యాల
ఇటీవల నమోదైన కేసులు..
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అశోక్రోడ్కు చెందిన ఓ యువకడు యూట్యూబ్, పోర్న్ వెబ్సైట్లు చూడడమే కాకుండా తనకు తెలిసిన వారికి షేర్ చేశాడు. నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లాయిటెడ్ చిల్డ్రెన్ ప్రత్యేక విభాగం స్థానిక పోలీసులకు యువకుడి వివరాలు పంపించి కేసు నమోదుకు ఆదేశించింది. పోలీసులు యువకుడి ఇంటికి వెళ్లి కేసు నమోదు చేశారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని భగవంతం వాడకు చెందిన ఓ సింగరేణి ఉద్యోగి చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు తరచూ చూస్తుండేవాడు. చూడడమే కాకుండా ఇతరులకు షేర్ చేశాడు. దీంతో నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లాయింటెడ్ చిల్డ్రెన్ ప్రత్యేక విభాగం అతడిని గుర్తించి సదరు యువకుని అడ్రస్తో సహా స్థానిక పోలీస్స్టేషన్కు సమాచారం అందించింది.
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో మదీన కాలనీకి చెందిన ఓ వ్యక్తి పిల్లల అశ్లీల వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అతనిపై ఈనెల 5న కేసు నమోదు చేశారు.
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బామ్ని(కె) గ్రామానికి చెందిన తౌడు శ్రావణ్ పిల్లల అశ్లీల ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. పోర్న్ ఫొటోలు, వీడియోలు బ్రౌజ్ చేసి డౌన్లోడ్, అప్లోడ్ చేసినందుకు అతడిపై ఈనె 5న పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: ఆర్టీసీ డ్రైవర్పై విచక్షణా రహితంగా దాడి


