సాక్షి, హైదరాబాద్: ఉల్లి ఉలికిపాటుకు గురిచేస్తోంది. ధరల ఘాటు కన్నీళ్లు పెట్టిస్తోంది. జూలైలో కిలో రూ.20 ఉండగా.. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో రూ.60 నుంచి 70 వరకు పలుకుతోంది. కాలనీల్లో రూ.80– 90 వరకు అమ్ముతున్నారు. దీంతో కూరల్లో ఉల్లి వాడాలంటేనే వణుకు పుట్టించే పరిస్థితి నెలకొందని గృహిణులు చెబుతున్నారు. లెక్కేసుకుని మరీ కొంటున్నామని అంటున్నారు. హోటళ్లు, కేటరింగ్ వాళ్లు టిఫిన్లు, భోజనాల్లో ఉల్లి వాడకం తగ్గించడం గమనార్హం.
నాసిక్లో వర్షాలతో..
ఉల్లి ధరల పెరుగుదలకు ప్రధాన కారణం సరఫరా తగ్గిపోవడమే. మలక్పేట మార్కెట్కు గతంలో ప్రతిరోజూ సుమారు 25 వేల బస్తాలు వచ్చేవి. ప్రస్తుతం 15 వేలకు పడిపోయాయి. నగరానికి ఉల్లి ఎక్కువగా మహారాష్ట్రలోని నాసిక్ నుంచే వస్తుంది. అక్కడ భారీ వర్షాలకు పంట మునిగింది. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వర్షాలు లేక దిగుబడి పడిపోయింది. ఈ ప్రభావం నగరంపై పడింది. మరో నెల రోజుల పాటు ఉల్లి ధరలు మండుతూనే ఉంటాయని నగర వ్యాపారులు చెబుతున్నారు. అక్టోబర్లో కొత్త పంట వస్తేనే ధరలు తగ్గే అవకాశముంది.


