రమణా రెడ్డి ఇంటి ఎదుట ధర్నా చేస్తున్న బాధితులు, రమణారెడ్డి దంపతులు (ఫైల్)
లబోదిబోమంటున్న బాధితులు
హైదరాబాద్: చిట్టీల పేరుతో ప్రజల నుంచి రూ.20 కోట్లు వసూలు చేసిన దంపతులు అదృశ్యమయ్యారు. 15 రోజులుగా ఆ దంపతులు కనిపించకుండా పోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు శుక్రవారం హెచ్ఎంటీ హిల్స్లోని వారి ఇంటి ముందు ధర్నా చేపట్టారు. ఈ ఘటన కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. బాధితులు, పోలీసులు తెలిపిన మేరకు.. హెచ్ఎంటీ సాయిచరణ్ కాలనీకి చెందిన సీత, రమణా రెడ్డి దంపతులు చిట్టీల వ్యాపారం మొదలుపెట్టారు.
అయితే చిట్టీల వాయిదాలు పూర్తయినప్పటికీ తమకు రావాల్సిన సొమ్ము ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని అడిగేందుకు వెళితే వాయిదా వేస్తూ తీరా కనిపించకుండా పోయారు. అందరికి చిట్టీల డబ్బు రూపంలో సుమారు 20 కోట్ల వరకు చెల్లించాల్సి ఉందని బాధితులు పేర్కొంటున్నారు. చిట్టీలు పాడుకున్న వారికి సకాలంలో డబ్బులు ఇవ్వకుండా పరారయ్యారు.
పైగా తమకు కోర్టు ద్వారా నోటీసులు పంపించడం పట్ల బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సొమ్మును తిరిగి ఇప్పించి న్యాయం చేయాలని బాధితులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే బాధితులు ఆరోపిస్తున్నట్లుగా కాకుండా ..రూ.60 లక్షలు మోసపోయినట్లు ఆరుగురు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. మిగతా వారు కూడా ఫిర్యాదు చేస్తే కేసు దర్యాప్తు చేపట్టి నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: ‘క్యూర్’ బిల్లు.. హైదరాబాద్ పాలనలో కీలక మార్పులే!


