సాక్షి, హైదరాబాద్: గణనాథులు వేడుకలకు సిద్ధమవుతున్నారు. విగ్రహమూర్తులు తుదిమెరుగులు దిద్దుకుంటున్నారు. ఈ నెల 14న వినాయక చవితి ఉండగా..నగర శివార్లలో సందడి షురూ అయింది, ధూల్పేట్తో పాటు ఇప్పుడు అనేక ప్రాంతాల్లో వినాయక విగ్రహాల తయారీ ఊపందుకుంది. ఈసారి విగ్రహాల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, కొబ్బరిపీచు, రంగులు, తదితర ముడి వస్తువుల ధరలు పెరగడంతో పాటు రవాణా చార్జీల భారం దృష్ట్యా విగ్రహాల ధరలను పెంచాల్సి వస్తుందని ధూల్పేట్కు చెందిన రాజేందర్ తెలిపారు.
ఐదడుగుల విగ్రహాలు మొదలుకొని 30 అడుగుల భారీ విగ్రహాల వరకు అమ్మకానికి సిద్థంగా ఉంచినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి ధూల్పేట్ విగ్రహాలకు ఎంతో డిమాండ్ ఉంటుందన్నారు. కొంతకాలంగా నాగోలు, ఎల్బీనగర్, ఉప్పల్, కూకట్పల్లి హౌసింగ్బోర్డు, మియాపూర్, ఘట్కేసర్ తదితర ప్రాంతాల్లో సైతం విగ్రహాల తయారీ..అమ్మకాలు విస్తరించాయి.
ధరలకు రెక్కలు....
మూడడుగులు చిన్న విగ్రహాల నుంచి భారీ విగ్రహాల వరకు ఈసారి ధరాభారంగానే ఉండనున్నాయి.20 ఫీట్ల ఎత్తు ఉన్న విగ్రహాలు గత సంవత్సరం రూ.85 వేల వరకు విక్రయించగా, ఇప్పుడు రూ.లక్ష వరకు చెబుతున్నారు. బేరసారాల్లో ఎంతోకొంత తగ్గినా విగ్రహాల తయారీ భారంగా మారడం వల్ల ధరలు పెంచక తప్పడం లేదని నాగోలుకు చెందిన రవీందర్ తెలిపారు.
ఎక్కువ మంది కొనుగోలు చేసే 12 ఫీట్లు, 16 ఫీట్ల విగ్రహాలు గత సంవత్సరం రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు లభించాయి. ఇప్పుడు రూ.70 వేల నుంచి రూ.80 వేలు దాటే అవకాశం ఉంది.విగ్రహాలకు అదనపు అలంకరణలు, హంగు, ఆర్భాటాలకు అనుగుణంగా ధరలను పెంచుతున్నారు. విగ్రహాల తయారీకి వినియోగించే రంగులు, అలంకరణ కూడా ధరలపైన ప్రభావం చూపుతుందని ధూల్పేట్కు చెందిన బబ్బూసింగ్ తెలిపారు.
తీరొక్క రూపులో..
భక్తుల మదిని దోచే వివిధ రకాల భంగిమలు, ఆకృతులతో, చక్కటి రంగులతో అద్భుతంగా తీర్చిదిద్దిన విగ్రహాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ఒకప్పుడు దక్షిణాది రాష్ట్రాలకే ధూల్పేట్ ప్రధాన మార్కెట్గా ఉండేది. కానీ కొంతకాలంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా విగ్రహాలను హైదరాబాద్కు తరలించి విక్రయిస్తున్నారు. దీంతో పోటీ బాగా పెరిగిందని ధూల్పేట్కు చెందిన రాజేశ్వరి తెలిపారు.
ఎవర్గ్రీన్ ధూల్పేట్..
వినాయక విగ్రహాల తయారీ, అమ్మకాలు అనేక ప్రాంతాలకు విస్తరించినప్పటికీ ధూల్పేట్ విగ్రహాలకు ఆదరణ కొనసాగుతూనే ఉంది. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒడిశా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లోనూ ధూల్పేట వినాయక విగ్రహాలకు డిమాండ్ ఉంది. 12 ఇంచులు, 6 ఇంచుల విగ్రహాలు కూడా ధూల్పేట్లో విక్రయిస్తున్నారు. విగ్రహాల బరువును తగ్గించేందుకు, వాటిని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు కొత్తగా ఫైబర్తో అలంకరించడం వల్ల ధరలు పెంచవలసి వచి్చందని రాకేష్ సింగ్ తెలిపారు. 20 అడుగుల నుంచి 30 అడుగుల వరకు ఉన్న విగ్రహాలు, వాటి ఆకృతులు, డిజైన్లు, వినియోగించిన రంగులు, ఫైబర్, తదితరాల ఆధారంగా రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు ధర ఉండనున్నాయి.
చదవండి: లేస్ నుంచి మ్యాగీ వరకు.. అసలేం జరుగుతుందంటే?


