ఇస్లామాబాద్: దేశంలో నెలకొన్న కీలక సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే తన వ్యక్తిగత జీవితంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) ఛైర్మన్ బిలావల్ భుట్టో.. జర్దారీ షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆస్ట్రియా రాజకుటుంబానికి చెందిన మహిళతో తనకు వివాహం కుదిరినట్లు వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఈ మేరకు విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన మాట్లాడారు.
‘నా వివాహం ఖరారు కాలేదు, ఎలాంటి నిశ్చితార్థం జరగలేదు. ప్రిన్సెస్ గ్లోరియా అనే వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఏ విషయమైనా మా కుటుంబమే స్వయంగా ప్రకటిస్తుంది’ అని బిలావల్ స్పష్టం చేశారు. ఆగస్టు 26న ఇస్లామాబాద్లోని ‘పాకిస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ (పీఐఎమ్ఎస్) ఆస్పత్రిలోని నియోనాటల్ వార్డులో అగ్నిప్రమాదం సంభవించి 14 మంది నవజాత శిశువులు మృతి చెందిన ఘటనపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో కనీసం ఫైర్ అలారాలు, స్ప్రింక్లర్లు లేకపోవడం, భద్రతా లోపాలపై మధ్యంతర విచారణ నివేదిక స్పష్టం చేసిందని పేర్కొన్నారు.
ఒక ఆస్పత్రిని కూడా సరిగ్గా నిర్వహించలేని మంత్రి, పాకిస్థాన్కు గోర్బచేవ్లా మారి, దేశాన్ని 30 భాగాలుగా విభజించాలని చూస్తున్నారంటూ మంత్రి మొహసిన్ నఖ్వీని ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. కొత్త ప్రావిన్సుల ఏర్పాటు వంటి రాజ్యాంగపరమైన నిర్ణయాలను వీధుల్లో లేదా వ్యాపార సదస్సుల్లో తేల్చలేరని, వీటికి పార్లమెంటరీ, రాజ్యాంగ ప్రక్రియ అవసరమని బిలావల్ స్పష్టం చేశారు. కాగా అగ్నిప్రమాదం ఘటనపై స్పందించిన ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇప్పటికే ఎనిమిది మంది అధికారులను సస్పెండ్ చేసి క్రిమినల్ చర్యలకు ఆదేశించారు.
ఇది కూడా చదవండి: అమెరికా: కత్తితో మహిళ వీరంగం: ఒకరి మృతి.. నిందితురాలి కాల్చివేత!


