కథువా: జమ్మూకశ్మీర్లోని కథువా జిల్లాలో సరిహద్దు గ్రామంలో పాకిస్థాన్ మొబైల్ ఫోన్ నంబర్ చెక్కి ఉన్న రింగ్తో పావురం స్థానికులకు పట్టుబడ్డట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. చాన్ ఖత్రియాన్ ప్రాంతంలోని తన వ్యవసాయ పొలాల్లో ఓ స్థానిక వ్యక్తి గుర్తుతెలియని పావురాన్ని గుర్తించాడు. దాని కాలికి ఒక రింగ్ ఉండటాన్ని గమనించాడు. పరిశీలించగా ఆ రింగ్పై పాకిస్థాన్ మొబైల్ నంబర్ 03001717652 ఉన్నట్లు తేలింది. ఈ నంబర్ పాకిస్థాన్లోని జాజ్/మొబిలింక్ నెట్వర్క్కు సంబంధించినదిగా చెబుతున్నారు.
ఆ గ్రామస్థుడు వెంటనే స్థానిక అధికారులకు సమాచారం అందించాడు. అధికారులు పావురాన్ని తమ అధీనంలోకి తీసుకుని, రింగ్పై ఉన్న నంబర్తో పాటు ఇతర వివరాలను ధ్రువీకరించే ప్రక్రియ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు రింగ్ మినహా అనుమానాస్పద వస్తువులు ఏవీ ఉన్నట్లు తెలియలేదు.
కథువా అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉండటంతో ఈ ఘటనకు ప్రాధాన్యం సంతరించుకుంది. జమ్మూ సరిహద్దు ప్రాంతంలో డ్రోన్ల కదలికలు, సరిహద్దు జిల్లాల్లోకి చొరబాటు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వచ్చిన సమాచారంతో భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పాకిస్థాన్కు సంబంధించిన గుర్తులు ఉన్న పావురం జమ్మూ ప్రాంతంలో పట్టుబడటం ఇదే మొదటిసారి కాదు. 2020 మేలో కథువాలోని హీరానగర్ ప్రాంతం మన్యారి గ్రామస్థులు సంఖ్యలు, గుర్తులు ఉన్న రింగ్ ధరించిన పావురాన్ని పట్టుకున్నారు. దీంతో భద్రతా దర్యాప్తు జరిగింది. గూఢచర్యానికి సంబంధించిన ఆధారాలు ఏవీ లభించకపోవడంతో అధికారులు ఆ పావురాన్ని పరిశీలించిన అనంతరం విడుదల చేశారు.
జమ్మూలోని అఖ్నూర్, ఇతర సరిహద్దు ప్రాంతాల్లోనూ రింగులు, సంకేతాలు లేదా అసాధారణ గుర్తులు ఉన్న పావురాలు పట్టుబడిన ఘటనలు గతంలో నమోదయ్యాయి. ప్రాంతం సున్నితమైనది కావడంతో పోలీసులు, భద్రతా సంస్థలు వాటిపై దర్యాప్తు చేపట్టాయి. కథువాలో పాకిస్థాన్ మొబైల్ నంబర్ ఉన్న రింగ్తో పావురం పట్టుబడిన అంశాన్ని అధికారులు నిర్ధారించాల్సి ఉంది.


