స్టాలిన్‌ బిగ్‌ ప్లాన్‌.. సెప్టెంబర్‌ 17పై నేతల్లో టెన్షన్‌! | Ex CM Stalin Full Focus On Party Rebuild After DMK Defeat | Sakshi
Sakshi News home page

స్టాలిన్‌ బిగ్‌ ప్లాన్‌.. సెప్టెంబర్‌ 17పై నేతల్లో టెన్షన్‌!

Aug 31 2026 9:07 AM | Updated on Aug 31 2026 9:07 AM

Ex CM Stalin Full Focus On Party Rebuild After DMK Defeat

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పరాజయం డీఎంకేలో భారీ సంస్థాగత మార్పులకు దారితీస్తోంది. ఓటమికి కారణాలను విశ్లేషించిన కమిటీ నివేదిక ఆధారంగా పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్‌ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. 77 జిల్లాలను ఏకంగా 110 జిల్లాలుగా విభజించి.. పార్టీలో సీనియర్ల ఆధిపత్యాన్ని తగ్గిస్తూ కొత్త నాయకత్వానికి అవకాశం కల్పించే దిశగా అడుగులు వేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ప్రతీ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను ఒక జిల్లాగా ఏర్పాటు చేయడంతో.. కొత్త జిల్లాలకు తాత్కాలిక ఇన్‌చార్జులను నియమించేందుకు కసరత్తు వేగం పుంజుకుంది. ఇప్పటికే ఉన్న జిల్లా కార్యదర్శులు కార్యవర్గ సమావేశాలు నిర్వహించి 15 రోజుల్లో అధిష్టానానికి సిఫార్సులు పంపాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎవరికి ప్రమోషన్‌.. ఎవరికి షాక్‌? అన్న ఉత్కంఠ డీఎంకేలో నెలకొంది.

సీనియర్లకు చెక్‌.. కొత్తవారికి ఛాన్స్‌?
వయోపరిమితి కారణంగా 15 మందికి పైగా సీనియర్‌ నేతలకు జిల్లా స్థాయిలో అవకాశం దక్కకపోవచ్చని తెలుస్తోంది. మరికొందరు మాజీ మంత్రులు, కీలక నేతల అధికారాలను కూడా పరిమితం చేసే యోచనలో స్టాలిన్‌ ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా చెన్నై, మదురై జిల్లాల్లో పార్టీ పనితీరుపై జరిగిన సమీక్షల నేపథ్యంలో కొందరు సీనియర్‌ నేతలకు షాక్‌ తప్పదనే ప్రచారం జరుగుతోంది. చెన్నైలో మాజీ మంత్రులు పీకే శేఖర్‌బాబు, ఎం. సుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్యే మైలై వేలు, మాధవరం సుదర్శనం వంటి నేతల విషయంలో మార్పులు ఉండొచ్చనే చర్చ సాగుతోంది. మరోవైపు యువనేత ఉదయనిధి స్టాలిన్‌కు సన్నిహితులుగా భావించే కొందరికి కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

సెప్టెంబర్‌ 17న అసలు సీన్‌!
కొత్తగా ఏర్పాటు చేసిన 110 జిల్లాల ఇన్‌చార్జులను సెప్టెంబర్‌ 17న జరిగే డీఎంకే ముప్పెరుం విళా వేదికగా స్టాలిన్‌ పార్టీ శ్రేణులకు పరిచయం చేయనున్నట్లు సమాచారం. దీంతో ఆ రోజున డీఎంకేలో భారీ స్థాయిలో సంస్థాగత మార్పులకు తెరలేవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. ఎన్నికల ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న స్టాలిన్‌.. ఇప్పుడు పార్టీని కింది స్థాయి నుంచి రీబిల్డ్‌ చేయడంపై ఫోకస్‌ పెట్టినట్లు కనిపిస్తోంది. అయితే ఈ ప్రక్షాళనలో సీనియర్లకు ఎంతమేర షాక్‌.. కొత్త నాయకత్వానికి ఎంతమేర ఛాన్స్‌ దక్కుతుందన్నదే ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement