యోగి సర్కార్‌పై విమర్శల వేళ.. అంకిత్‌ కేసులో ట్విస్ట్‌ | Yogi Govt Under Fire Singer Ankit Balyan Case Takes Dramatic Turn | Sakshi
Sakshi News home page

యోగి సర్కార్‌పై విమర్శల వేళ.. అంకిత్‌ కేసులో ట్విస్ట్‌

Aug 31 2026 8:04 AM | Updated on Aug 31 2026 8:42 AM

Yogi Govt Under Fire Singer Ankit Balyan Case Takes Dramatic Turn

ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలపై ప్రతిపక్షాల విమర్శలు కొనసాగుతున్న వేళ.. హర్యాన్వీ గాయకుడు, యూట్యూబర్‌ అంకిత్‌ బల్యాన్‌ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అంకిత్‌పై కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్న ఇద్దరిని పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. సోమవారం వేకువ జామున షామ్లీ ఇండస్ట్రీయల్‌ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పరారైన మరికొందరి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.

హరియాణాలో పుట్టి పెరిగిన అంకిత్‌ బల్యాన్‌.. యూపీకి వలస వచ్చి స్థిరపడ్డాడు. తొలుత కబడ్డీ ప్లేయర్‌గా రాణించి.. గాయం కారణంగా సంగీతం వైపు మళ్లాడు. యూట్యూబ్‌ వీడియోలతో పాటు హర్యాన్వీ సాంగ్స్‌తోనూ మాంచి గుర్తింపు దక్కించుకున్నాడు. సోషల్‌ మీడియాలోనూ ఆయన వీడియోలకు విపరీతమైన పాపులారిటీ ఉంది. అయితే.. ఆగస్టు 26న సాయంత్రం షామ్లీ జిల్లా కోత్వాలి పీఎస్‌ పరిధిలో ఓ జిమ్‌ బయట అంకిత్‌ బల్యాన్‌ దారుణ హత్యకు గురయ్యాడు.

జిమ్‌ నుంచి బయటకు వచ్చి తన కారు వైపు వెళ్తున్న అంకిత్‌పై రెండు బైక్‌లపై వచ్చిన నలుగురు దుండగులు కాల్పులు జరిపారు. సీసీటీవీ ఫుటేజీలో నిందితులు అంకిత్‌ వైపు దూసుకొచ్చి వరుసగా కాల్పులు జరుపుతున్న దృశ్యాలు నమోదయ్యాయి. కనీసం 16 రౌండ్లు కాల్పులు జరిగినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన అంకిత్‌ను వెంటనే సమీపంలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ దృశ్యాలు, మొబైల్‌ ఫోన్‌ డేటా, ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చేపట్టారు

అయితే ఈ కేసులో అనుమానితులుగా భావిస్తున్న ఇద్దరు ఈ ఉదయం ఎన్‌కౌంటర్‌ అయ్యారు. వాళ్ల పేర్లు సుమిత్‌, మోహిత్‌గా పోలీసులు నిర్ధారించారు. అయితే వాళ్లు ఏ గ్యాంగ్‌? ఎందుకు అంకిత్‌ను హతమార్చారు అనేదానిపై ఇంకా ఓ కొలిక్కి రాలేదు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు ఉధృతం చేసినట్లు మాత్రమే వెల్లడించారు.

భార్య తీవ్ర హెచ్చరిక
హత్య అనంతరం అంకిత్‌ కుటుంబం పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తన భర్త హత్యకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని అంకిత్‌ భార్య డిమాండ్‌ చేశారు. నాలుగు రోజుల్లో హంతకులను పట్టుకోకపోతే ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నివాసం ఎదుట ఆత్మాహుతికి పాల్పడతానని ఆమె హెచ్చరించారు.
నా కొడుకు ఎవరితోనూ గొడవ పడలేదు.. అతడికి ఎలాంటి శత్రుత్వం లేదు. అన్యాయంగా అతడిని చంపారు. నా కొడుకును ఎలాగైతే చంపారో.. ఆ హంతకులనూ అలాగే చంపాలి అని సీఎం యోగికి అంకిత్‌ తండ్రి విజ్ఞప్తి చేశాడు. దీంతో.. పోలీసులు అంకిత్‌ కుటుంబాన్ని కలిసి దర్యాప్తు వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ పరిణామం జరిగిన కొద్దిరోజుల్లోనే ఇద్దరు అనుమానితులు ఎన్‌కౌంటర్‌లో హతమవడం కేసులో కీలక మలుపుగా మారింది.

గోగీ గ్యాంగ్‌ పేరు తెరపైకి
అంకిత్‌ హత్య జరిగిన కొన్ని గంటల్లోనే సోషల్‌ మీడియాలో ఓ వ్యక్తి తాను హరియాణాలోని సోనిపట్‌కు చెందిన భోలు షాపురి అని చెప్పుకుంటూ.. ఈ హత్యకు గోగీ గ్యాంగ్‌ బాధ్యత వహించినట్లు ప్రకటించాడు. దీంతో కేసులో గ్యాంగ్‌వార్‌ కోణం తెరపైకి వచ్చింది. అయితే ఈ ప్రకటనను పోలీసులు అధికారికంగా ధ్రువీకరించలేదు. అంకిత్‌కు ఎవరితోనైనా పాత వివాదాలు ఉన్నాయా? వ్యక్తిగత కక్షలే హత్యకు కారణమా? గ్యాంగ్‌ ప్రమేయం ఉందా? అనే కోణాల్లో దర్యాప్తు సాగుతోంది. ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన ఇద్దరు అనుమానితుల నుంచి లభించే సమాచారం కేసు దర్యాప్తులో కీలకంగా మారే అవకాశం ఉంది.

యోగి సర్కార్‌పై విమర్శలు
అంకిత్‌ బల్యాన్‌ హత్య ఘటన ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలపై మరోసారి రాజకీయ దుమారం రేపింది. సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌ సహా విపక్షాలు యోగి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించాయి. రాష్ట్రంలో సామాన్యులతో పాటు ప్రముఖులకు కూడా భద్రత లేకుండా పోయిందని ఆరోపించాయి. ఎస్‌పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ ఈ హత్యపై తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారిపోయిందని విమర్శించారు. వ్యక్తిగత కక్షలతో పాటు రాజకీయ కోణాన్ని కూడా పరిశీలించాలని డిమాండ్‌ చేశారు. దీంతో ఈ హత్య కేవలం నేర ఘటనగానే కాకుండా రాజకీయ అంశంగానూ మారింది.

ఎవరీ అంకిత్‌ బల్యాన్‌?
33 ఏళ్ల అంకిత్‌ బల్యాన్‌ హర్యాన్వీ సంగీతంలో గుర్తింపు పొందిన గాయకుడు, యూట్యూబర్‌. షామ్లీకి చెందిన ఆయనకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఐదు లక్షలకు పైగా ఫాలోవర్లు, యూట్యూబ్‌లో మూడు లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. సంగీతంలోకి రాకముందు అంకిత్‌ రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడాకారుడిగా ఉన్నారు. 2013–14 వరకు ఢిల్లీ, భోపాల్‌ తదితర ప్రాంతాల్లో జరిగిన పోటీల్లో పాల్గొన్నారు. కాలికి గాయం కావడంతో కబడ్డీకి దూరమై అనంతరం జిమ్‌లో చేరారు. 2022 ప్రాంతంలో హర్యాన్వీ సంగీతంపై దృష్టి పెట్టారు.

గాయకుడిగా మాత్రమే కాకుండా గీత రచయితగా, సంగీత స్వరకర్తగా కూడా పనిచేశారు. తన కెరీర్‌లో 50కి పైగా పాటలతో ప్రేక్షకులకు చేరువయ్యారు. ‘భారీ కోర్ట్‌ మే గోలి మారేంగే’, ‘బాడీ బిల్డర్‌’, ‘పీటీఐ’, ‘ఏక్‌ ఖటోలా జైల్‌ కే భీతర్‌’ వంటి పాటలతో పాపులర్‌ అయ్యారు. ఆయన పాటలు, వీడియోల్లో తుపాకులు, గొడవలు, గ్యాంగ్‌లు, లగ్జరీ కార్ల ప్రస్తావనలు తరచూ కనిపించేవి. త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా అంకిత్‌ భావిస్తున్నట్లు గతంలో సమాచారం వచ్చింది.

హత్యకు కొన్ని గంటల ముందు..
అంకిత్‌ హత్యకు కొన్ని గంటల ముందే తన కొత్త పాట ‘బేబీ బద్మాష్‌’కు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. అందులో హత్యను ప్రస్తావించే కొన్ని పంక్తులను పాడారు. హత్య తర్వాత ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ పాటకు, హత్యకు మధ్య ఏదైనా సంబంధం ఉందా? అన్నది మాత్రం ఇప్పటివరకు స్పష్టంగా తెలియలేదు.

ఇదీ చదవండి: జాక్‌పాట్‌ కొట్టిన కానిస్టేబుల్‌.. ఏకంగా కోట్లలో లాటరీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement