ఎగసిపడిన మంటలు
ప్రతీకారం తీర్చుకుంటామన్న రష్యా
మాస్కో/న్యూఢిల్లీ: నెలల తరబడి తమపై దాడులతో తెగబడుతున్న రష్యాపై ఉక్రెయిన్ మరోసారి బదులుతీర్చుకుంది. రష్యాలోని లెనిన్గ్రాడ్ ఓబ్లాస్ట్ పరిధిలోని కిరిషి నగరంలోని అత్యంత కీలకమైన చమురుశుద్ధి కర్మాగారంపై ఉక్రెయిన్ డ్రోన్లు దాడిచేశాయి. దీంతో ఆయిల్ రిఫైనరీ కేంద్రం నుంచి మంటలు చెలరేగాయి. గతంలో రెండుసార్లు దాడులతో నెలల తరబడి ఉత్పత్తిని ఆపేసి మరమ్మత్తుల తర్వాత ఇటీవలే ఉత్పత్తిని మొదలుపెట్టగా వెంటనే ఉక్రెయిన్ దాడులు చేయడం గమనార్హం.
ఈ దాడిలో ప్రాణనష్టం వివరాలను రష్యా బయటపెట్టలేదు. రిఫైనరీపై దాడికి యతి్నంచిన 62 డ్రోన్లలో నేలమట్టంచేశామని రష్యా ప్రకటించింది. శనివారం రాత్రి నుంచి గత 24 గంటల్లో 500 డ్రోన్లను కూల్చేశామని రష్యా రక్షణశాఖ తెలిపింది. దాడులకు ప్రతీకారం తప్పదని రష్యా అధ్యక్షకార్యాలయం అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోస్ హెచ్చరించారు.
భారత్ నుంచి రష్యాకు భారీగా పెట్రోల్
చమురు శుద్ది కర్మాగారాలపై ఉక్రెయిన్ దాడులు తీవ్రతరంచేయడంతో రష్యా స్థానిక అవసరాలకు సరిపడా చమురును ఉత్పత్తిచేయలేక దిగుమతులపై ఆధారపడుతోంది. దీంతో తాజాగా సముద్రమార్గం ద్వారా భారీస్థాయిలో పెట్రోల్ను సరఫరాచేస్తూ మిత్రదేశాన్ని భారత్ ఆదుకుంటోందని గణాంకాలు వెల్లడించాయి. గత రెండు నెలల్లో భారత్ నుంచి ఏకంగా 10 లక్షల బ్యారెళ్ల పెట్రోల్ రష్యాకు ఎగుమతి అయినట్లు వాణిజ్యరంగంలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
గుజరాత్లోని వడినార్ చమురుశుద్ది కర్మాగారం నుంచి ఎగుమతులు ఎక్కువగా జరిగాయి. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో భారత్ తన ఇంధనఅవసరాల కోసం రష్యా నుంచి ముడిచమురున భారీస్థాయిలో కొనుగోలుచేయడం తెల్సిందే. ఇందుకు ప్రతిగా ముడిచమురును శుద్ధిచేశాక వచ్చే పెట్రోల్ను తిరిగి రష్యాకు సరఫరాచేస్తున్నట్లు తెలుస్తోంది.


