15 గంటలపాటు దిగ్బంధనంలో ఉక్రెయిన్ రాజధాని
రష్యాలోని మరో ఆయిల్ రిఫైనరీకి మంటలు
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్ లక్ష్యంగా రష్యా వరుసగా రెండో రోజు శుక్రవారం కూడా దాడులను కొనసాగించింది. సైరన్ల మోతలు, ఆగకుండా సాగిన డ్రోన్ దాడులతో కీవ్ ప్రాంతంలో 15 గంటలపాటు లాక్డౌన్ పరిస్థితులు కొనసాగాయి. ఈ దాడుల్లో కీవ్లోని 14 గోదాములు, 16 ప్రైవేట్ నివాసాలు, మూడు అపార్టుమెంట్ భవనాలు, 16 వాహనాలు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. ఇద్దరు చనిపోగా, మరో ఇద్దరు గాయపడ్డారన్నారు.
కీవ్లోని పలు ప్రాంతాలపై శుక్రవారం మధ్యాహ్నం వరకు దాడులు కొనసాగుతూనే ఉన్నాయని చెప్పారు. ఈ కారణంగా రాజధానిలో వాయు నాణ్యత పడిపోయిందని, ప్రజలు ఇళ్లలోనే ఉండిపోవాలని, తలుపులు, కిటికీలు మూసి ఉంచాలని అధికారులు సూచనలు జారీ చేశారు. సుమీ ప్రాంతంలోని తపాలా శాఖ కార్యాలయాన్ని నాలుగు గ్లైడ్ బాంబులు ధ్వంసం చేశాయి.
ఇక్కడ ఒకరు చనిపోగా ఏడుగురు గాయపడ్డారు. ఖెర్సన్ ప్రాంతంపైకి రష్యా ప్రయోగించిన గ్లైడ్ బాంబులతో విద్యుత్ ప్లాంట్, హీటింగ్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఖెర్సన్ ప్రాంతంలో 70 శాతం వరకు ఇప్పటికే రష్యా ఆ«దీనంలోకి వెళ్లిపోయింది. మిగతా ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలంటూ అధికారులు గురువారం సూచనలు జారీ చేశారు.
మరోవైపు సరిహద్దులకు వెయ్యి కిలోమీటర్ల దూరంలో రష్యాలోని యరోస్లావ్ల్ ప్రాంతంలో ఉన్న అత్యంత కీలకమైన స్లావ్నెఫ్ట్ యనోస్ రిఫైనరీపై డ్రోన్లతో దాడి చేశామని ఉక్రెయిన్ తెలిపింది. ఈ దాడిలో ఒకరు చనిపోగా, 27 మంది గాయపడినట్లు రష్యా అధికారులు తెలిపారు. డ్రోన్ శకలాలు ఒక బస్సుపై అందులోని పది మంది గాయపడ్డారన్నారు. క్రిమియాలోని సెవాస్టపోల్, రష్యా రాజధాని ప్రాంతం మాస్కోలోని సూపర్మార్కెట్పైనా డ్రోన్లతో దాడులు జరిపామని ఉక్రెయిన్ వెల్లడించింది.


