కఠ్మాండు: నేపాల్లో బుధవారం సంభవించిన ఆకస్మిక వరదల్లో పెద్ద ఎత్తున విధ్వంసం, భారీగా ప్రాణనష్టం సంభవించడం తెల్సిందే. ఒక్కసారిగా వచ్చి పడిన మెరుపు వరద అన్నిటినీ చుట్టేస్తూ నాశనం చేసుకుంటూ వెళ్తుండగా నేపాల్–భూటాన్ సరిహద్దులోని ఓ నివాసం మాత్రం చెక్కుచెదరలేదు. అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులు కూడా సురక్షితంగా బయటపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు తెగ వైరలవుతోంది.
పెను వేగంతో దూసుకొచ్చిన వరద ఆ ఇంటి చుట్టుపక్కల ప్రాంతాన్ని ముంచెత్తుతూ అక్కడున్న నిర్మాణాలన్నిటినీ నాశనం చేసేసింది. చుట్టుపక్కల భవనాలు కొట్టుకుపోగా ఆ ఇల్లు మాత్రం తట్టుకుని నిలబడగలిగింది. ఆ వీడియో కొద్దిసేపట్లోనే వైరల్గా మారింది. అందులోని ఆ ముగ్గురికీ ఏమైందంటూ చాలామంది సోషల్ మీడియా యూజర్లు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఓ నెటిజన్ మాత్రం వారు సురక్షితంగానే ఉన్నారని ధ్రువీకరించారు.
ఈ మేరకు ఒక వీడియోను షేర్ చేయడంతో అందరూ స్థిమితపడ్డారు. ఆ ఇల్లు అంత పటిష్టంగా ఉండటంపైనా ఆన్లైన్లో చర్చ జరిగింది. చుట్టూ ఉన్న భవనాలు, వ్యర్థాలు ప్రవాహంలో కొట్టుకుపోయినప్పటికీ, ఆ నిర్మాణం ఎలా తట్టుకుని నిలబడిందంటూ నెటిజన్లు ఆసక్తిగా ప్రశ్నించారు. ఒక యూజర్ అయితే.. ఆ ఇంటిని కట్టిన వ్యక్తికి నేపాల్ రత్న మాన్ పదవి పురస్కారం ఇవ్వాలంటూ వ్యాఖ్యానించారు. ఆ ఇంటి అసాధారణమైన నిర్మాణ కౌశలాన్ని ప్రశంసించారు.


