అమెరికాలో జన్మహక్కు పౌరసత్వాన్ని పరిమితం చేస్తూ అధ్యక్షుడు తీసుకొచ్చిన కొత్త ఆదేశానికి వెంటనే అడ్డుకట్ట వేయడానికి ఫెడరల్ జడ్జి డెబోరా బోర్డ్మన్ నిరాకరించారు. అయితే.. డొనాల్డ్ ట్రంప్ ఆదేశం చెల్లుబాటు అవుతుందని చెప్పలేదు. కొత్త ఆదేశాన్ని ప్రస్తుత పిటిషన్లో ప్రస్తావించకపోవడం వల్ల, దానిపై తక్షణమే స్టే ఇవ్వలేనని స్పష్టం చేశారు. అదే సమయంలో.. పిటిషనర్లు తమ కేసులో కొత్త ఆదేశాన్ని చేర్చుకునేందుకు అనుమతించారు. దీంతో ఈ వ్యవహారంపై త్వరగా విచారణ జరిగే అవకాశం ఉంది.
ట్రంప్ తొలిసారి 2025లో జన్మహక్కు పౌరసత్వాన్ని పరిమితం చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అమెరికాలో పుట్టిన పిల్లల తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాకపోయినా, చట్టబద్ధ శాశ్వత నివాసితులు కాకపోయినా వారికి ఆటోమేటిక్గా పౌరసత్వం రాకుండా చేయడం ఈ ఆదేశం ఉద్దేశం.
దీనిపై కోర్టుల్లో సవాళ్లు ఎదురయ్యాయి. చివరకు జూన్ 30న అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ తొలి ప్రయత్నాన్ని తిరస్కరించింది. 14వ రాజ్యాంగ సవరణలోని పౌరసత్వ నిబంధనలకు ఈ ఆదేశం విరుద్ధంగా ఉందని కోర్టు పేర్కొంది. దీంతో.. ట్రంప్ ఆగస్టు 6న మరో కొత్త ఆదేశాన్ని తీసుకొచ్చారు. ముఖ్యంగా అమెరికాకు ప్రసవం కోసం వచ్చే 'బర్త్ టూరిజం'ను లక్ష్యంగా చేసుకుని, కొన్ని సందర్భాల్లో పిల్లలకు పౌరసత్వం నిరాకరించేలా ఈ ఆదేశంలో నిబంధనలు పెట్టారు.
ఈ కొత్త ఆదేశంపైనే ఇప్పుడు మరోసారి న్యాయపోరు మొదలైంది. ప్రభుత్వ న్యాయవాదులు సెప్టెంబర్ 5లోగా దీనిని ఎలా అమలు చేయాలనే దానిపై ఫెడరల్ ఏజెన్సీలు మార్గదర్శకాలు జారీ చేస్తాయని కోర్టుకు తెలిపారు. కానీ.. జడ్జి బోర్డ్మన్ ఈ విషయంలో వేచి చూడాల్సిన అవసరం ఉందా?, అన్న దానిపై సందేహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులో 'బర్త్ టూరిజం'కు జన్మహక్కు పౌరసత్వం నుంచి మినహాయింపు ఎక్కడ ఉందని ఆమె ప్రశ్నించారు. దీంతో ట్రంప్ కొత్త ఆదేశం కూడా కోర్టులో నిలబడుతుందా?.. లేదా?, అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


