అమెరికా తెలుగు యువతి నిఖిత గోదిశాల హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ప్రియురాలి హత్య కేసులో సాప్ట్వేర్ ఇంజనీర్ అర్జున్ శర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగ్రాలోని ఓ అపార్ట్మెంట్లో దాక్కున్న అర్జున్ శర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా అర్జున్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. స్థానిక పోలీసుల సహకారంతో శంకర్ గ్రీన్ రెసిడెన్షియల్ సొసైటీలో అరెస్ట్ చేశారు.
అమెరికా-భారత్ నేరస్తుల అప్పగింత ఒప్పందం కింద తదుపరి చర్యలు చేపట్టనున్నారు. 2025 డిసెంబర్ 31న డబ్బు తిరిగి ఇస్తానంటూ నిఖితను పిలిచి హత్య చేశాడు. ఆర్థిక వివాదమే హత్యకు కారణమని అమెరికా అధికారులు చెబుతున్నారు. అమెరికాలోని ఎల్లికాట్ సిటీలో నివసించే నిఖిత జనవరి 2న కనిపించకుండా పోయింది. ఆ తర్వాత మేరీల్యాండ్లోని కొలంబియాలో ఉన్న ఆమె మాజీ రూమ్మేట్ అర్జున్ శర్మ అపార్ట్మెంట్లోనే ఆమె మృతదేహాన్ని గుర్తించారు. నిఖిత శరీరంపై కత్తిపోట్ల గాయాలు ఉన్నట్లు హోవార్డ్ కౌంటీ పోలీసులు తెలిపారు. నిఖిత నుంచి డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడనే ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు ఏప్రిల్లో తెలంగాణలో అర్జున్పై మోసం కేసు నమోదైంది.
దర్యాప్తులో భాగంగా కొన్ని కీలక ఆధారాలు లభించడంతో ప్రత్యేక పోలీసు బృందాన్ని ఆగ్రాకు పంపించాం. అక్కడ ఓ ఫ్లాట్లో అర్జున్ను గుర్తించి అదుపులోకి తీసుకున్నాం. మోసం కేసుకు సంబంధించి అతడికి నోటీసులు జారీ చేశాం. అదే సమయంలో అమెరికాలో అతడిపై కేసు ఉండటంతోపాటు నాన్-బెయిలబుల్ వారెంట్ (NBW) పెండింగ్లో ఉన్న విషయం గుర్తించాం. దీంతో కేంద్ర అధికారులకు సమాచారం అందించాం’’ అని హైదరాబాద్ పోలీసు అధికారి తెలిపారు. అర్జున్ను న్యూఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతడికి రిమాండ్ విధించింది. నిఖిత గత నాలుగేళ్లు అమెరికాలో డేటా, స్ట్రాటజీ అనలిస్ట్గా పనిచేసింది.


