హైదరాబాద్: భారత రాజ్యాంగం, పరిరక్షణపై హైదరాబాద్లో కీలక చర్చ జరగనుంది. ఎస్. జైపాల్ రెడ్డి మెమోరియల్ ఫౌండేషన్.. మంథన్ ఫౌండేషన్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యురాలు డాక్టర్ మేనకా గురుస్వామి ‘ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇట్స్ ప్రొటెక్షన్’ (Indian Constitution and its Protection) అనే అంశంపై ప్రసంగించనున్నారు.
ఈ కార్యక్రమం ఆగస్టు 29, శనివారం సాయంత్రం హైదరాబాద్లోని ఖైరతాబాద్లో ఉన్న ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ విశ్వేశ్వరయ్య భవన్ మెయిన్ ఆడిటోరియంలో జరగనుంది. సాయంత్రం 5.30 గంటలకు హై-టీ ఏర్పాటు చేశారు. అనంతరం 6 గంటలకు మేనకా గురుస్వామి ప్రసంగం ప్రారంభమవుతుంది. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, చట్టపరమైన అంశాలపై ఆసక్తి ఉన్నవారు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు.
ప్రస్తుతం దేశంలో రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్యం, ప్రాథమిక హక్కులు, చట్టబద్ధ పాలన వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రసంగానికి ప్రాధాన్యత ఏర్పడింది. అలాగే, రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు.. రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో న్యాయవ్యవస్థ, ప్రజాస్వామ్య సంస్థలు, పౌరుల పాత్ర ఏమిటనే అంశాలపై మేనకా గురుస్వామి తన అభిప్రాయాలను పంచుకోనున్నారు.
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా మేనకా గురుస్వామి రాజ్యాంగం, పౌర హక్కులకు సంబంధించిన పలు కీలక కేసుల్లో వాదించారు. ముఖ్యంగా భారతీయ శిక్షాస్మృతిలోని(IPC) సెక్షన్ 377ను సవాలు చేసిన న్యాయపోరాటంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగాన్ని ఎలా పరిరక్షించాలి? ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో పౌరుల బాధ్యత ఏమిటి? వంటి అంశాలపై ఆమె చేసే ప్రసంగం ఆసక్తిని రేకెత్తించే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, హైదరాబాద్ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ శ్రీకృష్ణ దేవరావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఇవి కూడా చదవండి: 40 ప్రశ్నలతో జనగణన


