ఓస్లో: నార్వే రాజు హరాల్డ్-5 కన్నుమూశారు. ఆయన వయసు 89 సంవత్సరాలు. ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు రాజభవనం వర్గాలు గురువారమే తెలిపాయి. ఆ ప్రకటన వచ్చిన కొన్ని గంటలకే ఆయన కన్నుమూశారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్న విషయం తెలిసిన భార్య, రాణి సోన్జా, యువరాజు హాకౌన్ తమ అధికారిక కార్యక్రమాలను కూడా రద్దు చేసుకున్నారు. అరుదైన హీమోలిటిక్ ఎనీమియాతో బాధపడుతున్న రాజు హరాల్డ్ కొన్ని వారాలుగా విధులకు దూరంగా ఉంటున్నారు.
ఈ నెలారంభంలో రాజధాని ఓస్లోలోని నేషనల్ ఆస్పత్రిలో ఆయన్ను చేర్పించారు. రక్తంలో ఇన్ఫెక్షన్ను వైద్యులు కొంతమేర నయం చేయడంతో ఆయన ఆరోగ్యం కాస్తంత కుదుటపడిందని ఇటీవల వార్తలు వచ్చాయి. ఇంతలోనే, ఓస్లోలోని రాజభవనం తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం స్థానిక సమయం ప్రకారం 06.35 గంటలకు (జీఎంటీ ప్రకారం 04.35 గంటలకు) ఓస్లోలోని జాతీయ ఆస్పత్రిలో ఆయన ప్రశాంతంగా తుదిశ్వాస విడిచారు. ఆ సమయంలో రాణి, యువరాజు, ఆయన భార్య, హరాల్డ్ సోదరి ఆస్ట్రిడ్ ఆస్పత్రికి వద్దే ఉన్నారు.
హరాల్డ్–5 యూరప్లోనే అత్యంత వృద్ధుడైన దేశాధినేతగా ఉన్నారు. 1991లో రాజుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తరచూ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరుతున్నారు. కాగా, హీమోలిటిక్ ఎనీమియా అంటే రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్యను తగ్గించే స్థితి. దీని ఫలితంగా అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతాయి.
పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలు
రాజభవనం పైకప్పుపై ఉన్న రాజ జెండాను సగం వరకు దించారు. ఆయన అంత్యక్రియలు జరిగే రోజు వరకు జాతీయ సంతాప దినాలను ప్రకటించారు. రాజభవనం వద్దకు పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకుని పూలు, జెండాలు ఉంచి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 14వ శతాబ్దం తర్వాత నార్వేలో జన్మించిన తొలి రాజు హరాల్డ్. ఆయన తర్వాత ఆయన కుమారుడు హాకోన్(53) రాజుగా బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం తరువాత ప్రభుత్వంతో కలిసి ప్రత్యేక రాష్ట్ర మండలి సమావేశాన్ని హాకోన్ నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి: జెన్ ఆల్ఫాతో మోదీ రాఖీ వేడుక.. హై-ఫైవ్లు ఇస్తూ


