579కి చేరిన మరణాల సంఖ్య
కొనసాగుతున్న గాలింపు, సహాయక చర్యలు
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎటుచూసినా శిథిలాల దిబ్బలే
4,451 మందిని రక్షించిన అధికారులు.. మరో 1,924 మంది గల్లంతు
నేపాల్ నుంచి ఢిల్లీకి చేరుకున్న 21 మంది తమిళనాడు వాసులు
స్వాగతం పలికిన విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్
భోటెకోశి నదీ ప్రాంతంలో మళ్లీ పెరిగిన నీటి మట్టం
మరోసారి వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిక
భోటెకోశి, త్రిశూలిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
కఠ్మాండు/బీజింగ్: సుందర హిమాలయ దేశం నేపాల్లో మృత్యుఘోష కొనసాగుతూనే ఉంది. ఆకస్మిక వరదల ధాటికి మరణించిన వారి సంఖ్య శుక్రవారం 579కు చేరింది. గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎటు చూసినా శిథిలాలే కనిపిస్తున్నాయి. భోటెకోశి నదీ ప్రాంతంలో నీటి మట్టం ఒక్కసారిగా పెరగడంతో మరోసారి వరదలు వచ్చే ప్రమాదం ఉందన్న అంచనాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
బుధవారం ఆకస్మిక వరద సంభవించిన చోటే బురదతో కూడిన నీటి మట్టం పెరిగిందని, ఇక్కడ మళ్లీ వరద వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. భోటెకోశి, త్రిశూలి ప్రాంతాల్లో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదం ఎదురైతే వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. రసువా, సెంట్రల్ నేపాల్లోని ఇతర ప్రాంతాలను బుధవారం ముంచెత్తిన భారీ ఆకస్మిక వరదల కారణంగా వందల మంది మరణించడంతో పాటు భారీగా నివాస ప్రాంతాలు, రహదారులు, వంతెనలు, జలవిద్యుత్ మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి.
ఎనిమిది జిల్లాల్లో ఇప్పటిదాకా 579 మృతదేహాలను వెలికితీసినట్లు నేపాల్ పోలీసులు వెల్లడించారు. వేలాది మంది గల్లంతయ్యారు. ఇప్పటికీ వారి జాడ తెలియరావడం లేదు. నవల్పరాసి ఈస్ట్లో 154, చిత్వాన్లో 233, గోర్ఖాలో 46, నువాకోట్లో 37 మృతదేహాలను వెలికితీశారు. అలాగే ధాడింగ్లో 40, తానాహులో 30, నవల్పరాసి వెస్ట్లో 27, రసువాలో 12 మృతదేహాలను వెలికితీశారు. టిబెట్ స్వయంప్రతిపత్తి ప్రాంతంలోని గిరోంగ్ కౌంటీలో ఐదుగురు మరణించారు.
వరదలు సంభవించినప్పటి నుంచి 86 మంది భద్రతా సిబ్బంది, 517 మంది విదేశీ పర్యాటకులు, 127 మంది నేపాలీ ప్రయాణికులతో సహా కనీసం 1,924 మంది గల్లంతయ్యారు. ఇప్పటివరకు వివిధ ప్రభావిత ప్రాంతాల నుంచి 4,451 మందిని రక్షించారు. వీరిలో 85 మంది భారతీయులతో సహా మొత్తం 129 మంది విదేశీయులు, అలాగే వివిధ జలవిద్యుత్ ప్రాజెక్టుల సొరంగాల్లో చిక్కుకుపోయిన 191 మంది ఉన్నారు. గాయపడిన 101 మంది రాజధాని కఠ్మాండులోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గల్లంతైన వారి కుటుంబ సభ్యులు తమ వారి కోసం ఆసుపత్రుల్లో వెతుకుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
121 మంది విదేశీ పర్యాటకులను రక్షించాం
వరద ప్రభావిత ప్రాంతాల నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు 85 మంది భారతీయులు, 9 మంది దక్షిణ కొరియన్లు, 16 మంది చైనా పౌరులతో సహా మొత్తం 121 మంది విదేశీ పర్యాటకులను రక్షించినట్లు నేపాల్ పర్యాటక బోర్డు ప్రకటించింది. గాలింపు, సహాయక చర్యలు మూడో రోజు మరింత ముమ్మరంగా కొనసాగాయని, ఇందులో 2,391 మంది నేపాల్ సైనిక సిబ్బందితో సహా మొత్తం 7,451 మంది భద్రతా సిబ్బంది భాగస్వాములయ్యారని ప్రభుత్వం వెల్లడించింది.
బాధితులను తరలించడానికి హెలికాప్టర్లను ఉపయోగించగా, భూతల బృందాలు నదీ తీరాల్లో, దిగువన ఉన్న నివాస ప్రాంతాల్లో గాలింపు కొనసాగిస్తున్నాయి. మరోవైపు ఆసుపత్రుల్లో మృతదేహాలను భద్రపర్చడానికి తగినంత స్థలం లేకపోవడం సమస్యగా మారింది. విపత్తు సహాయ నిధికి తమ ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా, ఆయన మంత్రివర్గ సభ్యులు నిర్ణయించారు. ఆకస్మిక వరదల వల్ల నష్టపోయిన పౌరులు, వ్యాపార సంస్థల కోసం సహాయం, రాయితీతో కూడిన పునరావాస ప్యాకేజీని రూపొందించాలని మంత్రివర్గం ఆర్థిక శాఖను ఆదేశించింది.
గిరోంగ్ కౌంటీ నుంచి వెయ్యి మంది తరలింపు
టిబెట్–నేపాల్ సరిహద్దు సమీపంలోని గిరోంగ్ కౌంటీ నుంచి 555 మంది పర్యాటకులతో సహా 1,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చైనా అధికారులు శుక్రవారం తెలిపారు. ప్రస్తుతం అక్కడ పర్యాటకులెవరూ లేరని చెప్పారు. చైనా వైపున ఉన్న ఓడరేవుకు వెళ్లే రహదారులు ఆకస్మిక వరదల వల్ల తెగిపోయాయి. దీనివల్ల సమాచార వ్యవస్థలు, విద్యుత్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది.
మరో 10 టన్నుల సహాయక సామగ్రి
వరదలతో అతలాకుతలమైన నేపాల్కు మూడో విడత కింద 10 టన్నుల సహాయక సామగ్రిని, 11 మంది సభ్యులతో కూడిన వైద్యులు, పారామెడిక్స్ బృందాన్ని, అలాగే సొరంగంలో సహాయక చర్యలను అంచనా వేసే బృందాన్ని భారత్ శుక్రవారం పంపించింది. ఇందులో పోర్టబుల్ జనరేటర్ సెట్లు, డిగ్నిటీ కిట్లు, ఆహార ప్యాకెట్లు, నీటి శుద్ధి మాత్రలు ఉన్నాయని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు. నేపాల్లో కొనసాగుతున్న సహాయక, రక్షణ చర్యలకు భారత్ మద్దతును కొనసాగిస్తోందని పేర్కొన్నారు. బుధవారం 10 టన్నుల మానవతా సహాయం, విపత్తు సహాయక సామగ్రిని, గురువారం మరో 37.5 టన్నుల సహాయక సామగ్రిని నేపాల్కు భారత్ పంపింది. నేపాల్కు అన్ని విధాలా సహాయం అందిస్తామని భారత ప్రధాని మోదీ ఇప్పటికే భరోసా ఇచ్చారు.
320 మంది భారతీయులు మిస్సింగ్
నేపాల్–టిబెట్ సరిహద్దులో సంభవించిన భారీ ఆకస్మిక వరదల కారణంగా కనీసం 320 మంది భారతీయులు గల్లంతయ్యారని, మరో 400 మంది చైనా వైపు చిక్కుకుపోయారని, వారంతా ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారని భారత విదేశీ వ్యవహారాల శాఖ శుక్రవారం తెలిపింది. ఈ విపత్కర పరిస్థితుల్లో నేపాల్ సాధ్యమైనంత సహాయం అందించడానికి భారత్ సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. చైనా వైపు చిక్కుకుపోయిన 96 మంది భారతీయులు భూమార్గం ద్వారా సురక్షితంగా నేపాల్కు చేరుకున్నారని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం 21 మంది తమిళనాడు వాసులను ఢిల్లీకి చేర్చినట్లు చెప్పారు. వీరికి ఢిల్లీ విమానాశ్రయంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ స్వాగతం పలికారు. ఈ 21 మంది కైలాస మానసరోవర్ యాత్ర వెళ్లి వరదల్లో చిక్కుకోగా నేపాల్ సైన్యం రక్షించింది. ఎస్.జైశంకర్ ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. నేపాల్లో గల్లంతైన భారతీయుల ఆచూకీ సాధ్యమైనంత త్వరగా గుర్తించాలని ఆదేశించారు.


