ఉక్రెయిన్లోని కీవ్ ప్రాంతంపై గత రాత్రిపూట రష్యా జరిపిన వైమానిక దాడుల్లో 27 మంది మృతి చెందినట్లు గవర్నర్ తైమూర్ తకాచెంకో శనివారం తెలిపారు. టెలిగ్రామ్ యాప్లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. మరో 42 మంది గాయపడినట్లు, బుచా జిల్లాలో దాడి జరిగిన ప్రాంతం నుంచి 380 మందికి పైగా ప్రజలను తరలిస్తున్నట్లు తెలిపారు.
రష్యా దాడిలో దాదాపు 50 నివాస భవనాలు దెబ్బతిన్నట్లు తకాచెంకో తెలిపారు. ఈ దాడి కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించి, ఇళ్లు, ఒక రెస్టారెంట్కు మంటలు వ్యాపించాయని చెప్పారు. దాడిలో ఏ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నారనే వివరాలను కీవ్ గవర్నర్ వెల్లడించలేదు.
గిడ్డంగిపై జరిగిన దాడి కారణంగా పేలుడు సంభవించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ తెలిపారు. సమీపంలోని మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. ఇందులో నివాస భవనాలు, వృద్ధుల సంరక్షణ కేంద్రం కూడా ఉన్నాయని తెలిపారు.
“ఇది జరగడానికి అనుమతించిన వారిని వారి నిర్ణయాలకు బాధ్యులను చేయాలి” అని ఆయన ఎక్స్లో పేర్కొన్నారు. అధికారుల నిర్లక్ష్యం ఆరోపణలపై ఇప్పటికే క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. బాధ్యులకు శిక్ష తప్పదని ఆయన హామీ ఇచ్చారు.
“నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఇళ్లకు లేదా ఇతర నివాస ప్రాంతాలకు సమీపంలో మందుగుండు సామగ్రిని నిల్వ చేయకూడదు. దీనిపై తగిన నిర్ణయాలు తప్పకుండా తీసుకుంటాం” అని జెలెన్స్కీ తెలిపారు.
గత మూడు రోజులుగా కీవ్పై దాదాపు నిరంతర వైమానిక దాడులు జరుగుతున్నాయి. రష్యా వైమానిక దాడులతో ఉక్రెయిన్ రాజధానిలో ఆర్థిక కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ దాడుల కారణంగా సాధారణ ప్రజల జీవనం కూడా తీవ్రంగా అంతరాయం ఎదుర్కొంటోంది.


