రసువా: వరదలతో అతలాకుతలమైన నేపాల్లోని రసువా జిల్లాలో ఒక అద్భుతం చోటుచేసుకుంది. భారీ వరద శిథిలాలు, బురద కింద మూడు రోజుల పాటు చిక్కుకుపోయిన ఆరేళ్ల బాలికను సహాయక బృందాలు సజీవంగా వెలికితీశాయి. రసువా జిల్లాలోని తిమురే గ్రామంలో పొంగిపొర్లిన భోటే కోషి నది తీవ్ర విధ్వంసం సృష్టించింది. ఈ క్రమంలో గాలింపు చర్యలు చేపడుతున్న ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (ఏపీఎఫ్) సిబ్బందికి నేల అడుగున నుంచి ఏడుపు శబ్దాలు వినిపించాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వేగంగా మట్టిని తవ్వి, బాలికను సురక్షితంగా బయటకు తీశారు.
తొలుత తిమురేలోని ఏపీఎఫ్ అవుట్పోస్టులో ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ, ఆరోగ్యం క్షీణించడంతో మెరుగైన వైద్యం కోసం శుక్రవారం రాత్రే ఖాట్మండుకు తరలించేందుకు ప్రయత్నించారు. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ ప్రయాణం ఆలస్యమైంది. శనివారం మధ్యాహ్నం వాతావరణం అనుకూలించడంతో ఆమెను ఖాట్మండులోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బాలిక వైద్యుల పర్యవేక్షణలో ప్రత్యేక చికిత్స పొందుతోంది. ఆ చిన్నారిని మనీషా మగర్గా గుర్తించారు. ఈ చిన్నారి కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం అధికారులు గాలిస్తున్నారు.
ఈ వరద విధ్వంసంపై నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ మాట్లాడుతూ.. పునర్నిర్మాణ పనులకు బిలియన్ల కొద్దీ డాలర్లు అవసరమవుతాయని, అంతర్జాతీయ సమాజం సహాయం అందించాలని కోరారు. తాజా గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 675 మృతదేహాలను వెలికితీయగా, 2,400 మందికి పైగా జనం గల్లంతయ్యారు.
ఇది కూడా చదవండి: డ్రగ్స్ రహిత దేశమే లక్ష్యం: ‘మన్ కీ బాత్’లో మోదీ


