బాంబులు, క్షిపణులతోనే కాదు.. ఇప్పుడు డాలర్తో ఇరాన్ను ఉక్కిరిబిక్కిరి చేయాలని అమెరికా వ్యూహం రచిస్తోంది. ఇరాన్కు ఆర్థికంగా అండగా నిలుస్తున్నాయన్న ఆరోపణలతో ఈజిప్ట్కు చెందిన బాంక్ మిసర్ యూఏఈ శాఖలపై అమెరికా ట్రెజరీ కొరడా ఝళిపించింది. యూఎస్ ఆర్థిక వ్యవస్థతో ఆ బ్యాంక్ శాఖలకు ఉన్న డాలర్ లావాదేవీల మార్గాన్ని కట్ చేసే ప్రతిపాదన చేసింది. డొనాల్డ్ ట్రంప్ సర్కార్ చర్యతో ఇరాన్కు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఉన్న మార్గాలను ఒక్కొక్కటిగా మూసివేసే ప్రయత్నం మరింత ముదిరింది. 2024 జనవరి నుంచి 2026 జూన్ వరకు బాంక్ మిసర్ యూఏఈ సుమారు 1.8 బిలియన్ డాలర్ల లావాదేవీలను ఇరాన్ షాడో బ్యాంకింగ్ నెట్వర్క్తో సంబంధం ఉన్న 103 సంస్థల కోసం ప్రాసెస్ చేసిందని అమెరికా ఆరోపిస్తోంది.
అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ఇప్పటికే ప్రపంచ దేశాలకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్కు సహకరించే సంస్థలు అమెరికా డాలర్, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను ఉపయోగించుకునే అవకాశం కోల్పోతాయని ఆయన తేల్చి చెప్పారు. ఈ చర్య ‘ఆపరేషన్ ఎకనామిక్ అవుట్కాస్ట్’లో భాగంగా చేపట్టినట్లు అమెరికా తెలిపింది. అయితే బాంక్ మిసర్పై చర్య ఇప్పటికిప్పుడు పూర్తిస్థాయిలో అమల్లోకి రాదు. ప్రతిపాదిత నిబంధనపై 30 రోజుల పాటు ప్రజల అభిప్రాయాలను స్వీకరించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు.
ఈజిప్ట్కు షాక్..
అమెరికా నిర్ణయంపై ఈజిప్ట్ స్పందించింది. ఈ చర్య యూఏఈలోని బాంక్ మిసర్ శాఖలు, వాటి డాలర్ లావాదేవీలకు మాత్రమే పరిమితం అవుతుందని స్పష్టం చేసింది. ఈజిప్ట్లోని బ్యాంక్ కార్యకలాపాలకు ఇది వర్తించదని తెలిపింది. మరోవైపు, యూఏఈ సెంట్రల్ బ్యాంక్ బాంక్ మిసర్ శాఖల లావాదేవీలపై ప్రత్యేక, అత్యవసర పరిశీలన ప్రారంభించింది.
కాగా, ఇరాన్పై అమెరికా ఒత్తిడి ఇప్పుడు సరికొత్త దశకు చేరుకుంది. ఇరాన్కు డబ్బు చేరే మార్గాలను కట్ చేయడం.. డాలర్ వ్యవస్థ నుంచి దూరం చేయడం.. దాని ఆర్థిక భాగస్వాములపై కూడా ఒత్తిడి పెంచడం ద్వారా టెహ్రాన్ను ఆర్థికంగా ఏకాకిని చేయాలని వాషింగ్టన్ ప్రయత్నిస్తోంది. బాంక్ మిసర్ యూఏఈ శాఖలపై తాజా చర్య అందులో భాగమే. మొత్తంగా.. ఇరాన్పై అమెరికా యుద్ధం ఇప్పుడు మరో ఫ్రంట్కు చేరింది. ఆయుధాలతో యుద్ధం చేస్తూనే.. మరోవైపు డాలర్ను ఆయుధంగా మార్చుకుని ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై అమెరికా గట్టి దెబ్బ కొట్టేందుకు సిద్ధమవుతోంది.


