ఇరాన్ ఘర్షణల నేపథ్యంలో ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరల భారాన్ని తగ్గించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలు చేపట్టారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలనంటుతుండటంతో వినియోగదారులకు ఉపశమనం కలిగించే మార్గాలపై చర్చించేందుకు వచ్చే వారం చమురు శుద్ధి (ఆయిల్ రిఫైనింగ్) సంస్థల అధిపతులతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. సెప్టెంబరు 1న జరగనున్న ఈ సమావేశానికి మారథాన్ పెట్రోలియం, వాలెరో ఎనర్జీ, చెవ్రాన్, డెలెక్ యూఎస్, పీబీఎఫ్ ఎనర్జీ వంటి దిగ్గజ ఇంధన ఉత్పత్తిదారులు, పంపిణీదారుల ప్రతినిధులు హాజరుకానున్నారు.
మిడ్టర్మ్ ఎన్నికల భయం!
రాబోయే నవంబరులో అమెరికా కాంగ్రెస్ మధ్యంతర (మిడ్టర్మ్) ఎన్నికలు జరగనున్నాయి. ఒకవైపు జీవన వ్యయం పెరిగిపోవడం, మరోవైపు గాలన్ పెట్రోల్ ధర 4 డాలర్లు, డీజిల్ ధర 6 డాలర్లు దాటడంతో ఓటర్లలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎన్నికల వేళ ఓటర్ల ఆగ్రహానికి గురికాకుండా ఉండేందుకే ట్రంప్ యంత్రాంగం ఈ దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టిందని కొందరు చెబుతున్నారు. ఇటీవల విడుదలైన సర్వేల్లో ట్రంప్ ప్రజాదరణ 33 శాతానికి పడిపోవడం రిపబ్లికన్ పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోందంటున్నారు.
సామాన్యుడిపై భారం
చమురు సంక్షోభం వేళ ఇంధన కంపెనీలు రెండో త్రైమాసికంలో భారీగా లాభాలు గడించడాన్ని ట్రంప్ తీవ్రంగా తప్పుపట్టారు. ప్రజల నుంచి పిండి పిప్పి చేస్తున్న అధిక ధరలను తగ్గించి వినియోగదారులకు ఊరట నివ్వాలని ఆయన కంపెనీలపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే, శుద్ధి సామర్థ్యం తగ్గడం, కఠినమైన బయోఫ్యూయెల్ నిబంధనలు తమకు ప్రతిబంధకంగా మారాయని కంపెనీలు వాదిస్తున్నాయి.
ఇదీ చదవండి: యూట్యూబ్తో అమెజాన్ చేతులు


