భారతీయ జీవిత బీమా రంగానికి గత ఆర్థిక సంవత్సరం (2024-25) కీలక మైలురాయిగా నిలిచింది. ఈ కాలంలో బీమా పరిశ్రమ మొత్తం రూ.8.86 లక్షల కోట్ల ప్రీమియం వసూలు చేసి మునుపటి ఏడాదితో పోలిస్తే 6.73 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. అయితే, వ్యాపార పరిమాణంలో ఈ తరహా పురోగతి కనిపించినప్పటికీ దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో బీమా శాతం మాత్రం 2.7 శాతానికి తగ్గడం గమనార్హం. ఇది కేవలం ప్రీమియం కలెక్షన్లు పెరిగినంత మాత్రాన బీమా రక్షణ సమగ్రంగా విస్తరించినట్లు కాదనే విషయాన్ని స్పష్టం చేస్తోంది.
ఆకర్షణీయమైన పాలసీ బెనిఫిట్స్, డిజిటల్ సౌలభ్యాలు ఎన్ని ఉన్నప్పటికీ క్లెయిమ్ల చెల్లింపు సమయమే బీమా సంస్థలకు అసలైన పరీక్షగా మారుతుంది. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి దూరమైనప్పుడు తక్షణ ఆర్థిక సంక్షోభం రాకుండా కాపాడటమే బీమా ముఖ్య ఉద్దేశం. అందువల్ల క్లెయిమ్ల పరిష్కార నిష్పత్తి కేవలం ఒక గణాంకం కాదని, అది పాలసీదారుల నమ్మకానికి అసలైన కొలమానమని పరిశ్రమ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఈ క్రమంలో యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ వరుసగా ఐదేళ్ల పాటు 99 శాతానికి పైగా వ్యక్తిగత డెత్ క్లెయిమ్ల పరిష్కార నిష్పత్తిని నమోదు చేస్తున్నట్లు కంపెనీ అధికారులు చెప్పారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 99.34 శాతంగా ఉన్న ఈ నిష్పత్తి 2025-26 నాటికి 99.80 శాతానికి మెరుగుపడిందని తెలిపారు. ఆ ఒక్క సంవత్సరంలోనే సంస్థ 20,529 క్లెయిమ్ల ద్వారా రూ.1,641 కోట్లను అందించిందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: యూట్యూబ్తో అమెజాన్ చేతులు


