ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు
ప్రధాని నరేంద్ర మోదీ హర్షం
ప్రధానమంత్రి జన్ధన్ యోజనకు 12 ఏళ్లు పూర్తి
న్యూఢిల్లీ: ప్రజలందరికీ బ్యాంకు ఖాతాలు ఇవ్వాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధానమంత్రి జన్ధన్ యోజన(పీఎంజేడీవై)కు 12 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ పథకం అపూర్వమైన ప్రభావాన్ని, గొప్ప ఫలితాలను సాధించిందని, ప్రజల జీవితాల్లో సానుకూల మార్పును తీసుకొచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. జన్ధన్ యోజన సాటిలేని ప్రభావాన్ని చూపిందని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. అలాగే జన్ధన్ యోజనపై ప్రభుత్వం చేసిన పోస్టును షేర్ చేశారు. పథకం ఘనతలను ప్రస్తావించారు. పీఎంజేడీవైని ప్రధాని మోదీ 2014 ఆగస్టు 28న ప్రారంభించారు.
ఇది దేశ ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన మార్పులకు నాంది పలికింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సమ్మిళితానికి దిక్సూచిగా నిలిచింది. భారతీయులందరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. బ్యాంకు సేవలు అందుబాటులో లేని ప్రతి వయోజనునికి, ఎలాంటి కనీస నిల్వ అవసరం లేకుండా, నిర్వహణ రుసుముల భారం లేకుండా ఈ పథకం ద్వారా ప్రాథమిక బ్యాంకు ఖాతా లభిస్తుంది. ప్రతి ఖాతాతోపాటు ఉచితంగా రూపే డెబిట్ కార్డు కూడా పొందవచ్చు. రూ.2 లక్షల ప్రమాద బీమా కవరేజీ లభిస్తుంది. డిజిటల్ లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఖాతాదారులు రూ.10,000 వరకు ఓవర్డ్రాఫ్ట్ సదుపాయాన్ని పొందవచ్చు. ఇది అత్యవసర సమయాల్లో రక్షణ కవచంలా ఉపయోగపడుతుంది.
33 కోట్ల మంది మహిళలకు ఖాతాలు
బ్యాంకు ఖాతా అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదని.. ఒక ఆర్థిక గుర్తింపుగా నిలుస్తుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. 2015లో 14.7 కోట్లుగా ఉన్న జన్ధన్ ఖాతాల సంఖ్య 2026 నాటికి 59 కోట్లకు చేరుకున్నాయి. తద్వారా కోట్లాది మంది ఆర్థిక వ్యవస్థ పరిధిలోకి చేరారు. అధికారిక ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం విస్తరించింది. నేడు దాదాపు 33 కోట్ల మంది మహిళలు జన్ధన్ ఖాతాలను కలిగి ఉన్నట్లు ప్రభుత్వం స్పష్టంచేసింది. ఇది మొత్తం జన్ధన్ ఖాతాదారులలో 56 శాతం కావడం విశేషం.
అధికారిక బ్యాంకింగ్ సేవలు విస్తృతంగా అందుబాటులోకి రావడం వల్ల ఎక్కువ మంది మహిళలు ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములవుతున్నారని ప్రభుత్వం వెల్లడించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 46 కోట్ల జన్ధన్ ఖాతాలు ఉన్నాయి. ఇవి మొత్తం జన్ధన్ ఖాతాల్లో 78 శాతం. కోట్లాది జన్ధన్ ఖాతాలు, గ్రామీణ ప్రాంతాలకు సేవల విస్తరణ, మహిళల భాగస్వామ్యం, చివరి వ్యక్తి వరకు బ్యాంకింగ్ సేవలు చేరడం వంటివి నేడు భారతదేశ బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులకు ప్రతీకగా నిలుస్తున్నాయని ప్రభుత్వం స్పష్టంచేసింది.


