న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం నుంచి విదేశాల్లో పర్యటించనున్నారు. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్లో ఆయన నాలుగు రోజులపాటు పర్యటిస్తారు. కిర్గిజిస్తాన్లో షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) వార్షిక సదస్సుకు హాజరవుతారు. తొలుత ఈ నెల 28, 29న ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వేర్వేరు కీలక రంగాల్లో భారత్, ఉజ్బెకిస్తాన్ మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చిస్తారు.
ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు మిర్జియోయెవ్తో సమావేశమై ప్రతినిధి స్థాయి చర్చలు నిర్వహిస్తారు. తాష్కెంట్లోని లాల్ బహదూర్ శాస్త్రి స్మారక చిహ్నాన్ని, తాషె్కంట్ స్టేట్ యూనివర్శిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్లోని మహాత్మా గాంధీ కేంద్రాన్ని కూడా మోదీ సందర్శించనున్నారు. ఉజ్బెకిస్తాన్ పర్యటన పూర్తయిన తర్వాత కిర్గిజిస్తాన్ రాజధాని బిషె్కక్కు చేరుకుంటారు. ఎస్సీఓ సదస్సులో ప్రసంగిస్తారు.
ఈ శిఖరాగ్ర సదస్సుకు చైనా అధినేత షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తదితరులు హాజరయ్యే అవకాశం ఉంది. ఎస్సీఓలో భారత్కు 2017 నుండి పూర్తి స్థాయి సభ్యత్వం ఉంది. ఈ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ ఎస్సీఓ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు కూడా నిర్వహిస్తారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఆయన ప్రత్యేకంగా భేటీ కాబోతున్నట్లు సమాచారం. అలాగే మధ్య ఆసియా సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అయిన ఆరో ‘వరల్డ్ నోమాడ్ గేమ్స్’ ప్రారంభోత్సవానికి కూడా ప్రధాని మోదీ హాజరుకానున్నారు.


