చార్జిషిటు దాఖలైన మూడు నెలల్లోగా ఈ ప్రక్రియ పూర్తి కావాలి
వరకట్న కేసుల విచారణపై సుప్రీంకోర్టు స్పష్టీకరణ
త్వరితగతిన న్యాయం కోసం మార్గదర్శకాలు జారీ
సాక్షి, న్యూఢిల్లీ: వరకట్న మరణాలు, మహిళలపై వేధింపుల కేసుల విచారణలో ఇకపై ఎలాంటి జాప్యం జరగడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తరహా కేసుల్లో చార్జిషిటు దాఖలైన 60 నుంచి 90 రోజుల్లోగా నిందితులపై అభియోగాలు ఖరారు చేయాలని విచారణా కోర్టులను దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అనవసర వాయిదాలు ఇవ్వకుండా సాక్ష్యాల నమోదును వీలైనంత వరకు రోజువారీగా జరపాలని సూచించింది. బాధితులకు సత్వర న్యాయం అందించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ట్రయల్ కోర్టులు అనుసరించాల్సిన విధానంపై జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఏజీ మసీహ్లతో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు 10 కీలక మార్గదర్శకాలను జారీ చేసింది.
ఉత్తరప్రదేశ్లో పెళ్లైన ఏడాదికే 20 ఏళ్ల యువతి అనుమానాస్పద మృతి కేసు విచారణ 24 ఏళ్లపాటు సాగిన పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం దేశవ్యాప్తంగా పాత కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి ఈ మార్గదర్శకాలు చేసింది. మార్గదర్శకాల అమలు నివేదికల పరిశీలన కోసం తదుపరి విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేసింది. బాధితులకు అండగా నిలిచేందుకు వన్–స్టాప్ సెంటర్లు, ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లు, మహిళా హెల్ప్డెస్క్లు, హెల్ప్లైన్లు, ఆన్లైన్ గ్రీవెన్స్ సిస్టమ్లను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మరింత బలోపేతం చేయాలని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.


