చైనా వైపునా జారిపడ్డ బురద మట్టి
నదీ సంగమ ప్రాంతంలో తాత్కాలిక సరస్సు
బురద మట్టి కట్ట తెగితే మళ్లీ మెరుపు వరద!
మెరుపు వరద విధ్వంసం నుంచి కోలుకోకముందే నేపాల్ మరో ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. భూటేకోషి నది ఎగువభాగంలోని హిమనీ నదం అకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో పెద్ద ఎత్తున నీరు, రాళ్లు, బురద దూసుకువచ్చి వందల మంది ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే. అయితే అంతటితో గండం గడవలేదు. అదే రోజు చైనావైపున కూడా బురదమట్టి జారిపడింది.
జిజాంగ్ ప్రాంతంలోని నేపాల్ సరిహద్దు వద్ద కొన్ని అడుగుల ఎత్తులో బురద మట్టి చేరిందని చైనాకు చెందిన సీసీటీవీ తెలిపింది. చైనా వైపు జరిగిన ప్రమాదం ఫలితంగా చోచెన్ ఖోలా, పెరుపు త్సాంగ్పో నదులు కలిసే చోట ఒక తాత్కాలిక సరస్సు ఏర్పడిందని చైనా జల వనరుల శాఖ గుర్తించింది. ప్రస్తుతం ఆ సరస్సులో సుమారు 20 లక్షల ఘనపు మీటర్ల నీరు నిల్వ ఉంది. పొంగి ప్రవహిస్తోంది కూడా.
రానున్న మూడు రోజుల్లో ఎగువ ప్రాంతాల నుంచి మరో 30 లక్షల ఘనపు మీటర్ల నీరు వచ్చి చేరే అవకాశముందని తెలుస్తోంది. ఒక క్యూబిక్ మీటర్ నీరు వెయ్యి లీటర్లకు సమానం. అంటే ఇప్పటికే అక్కడ రెండు వేల కోట్ల లీటర్ల నీరు ఉంటే.. ఇంకో మూడు రోజుల్లో మరో మూడు వేల కోట్ల లీటర్ల నీళ్లు వచ్చి చేరనున్నాయి. ఇంత భారీ మొత్తం నీటిని జారిపడ్డ బురదమట్టి ఎంత సేపు పట్టి ఉంచుకోగలదన్నది ప్రశ్న. కట్ట తెగితే నేపాల్ మరో బురద వరదలో మునగడం తప్పదనిపిస్తోంది.
– సాక్షి, నేషనల్ డెస్క్


