మార్కెట్ను శాసిస్తున్న సోషల్ మీడియా
షాపింగ్ ట్రెండ్స్ను ప్రభావితం చేస్తున్న రీల్స్
జెన్జీ నుంచి గ్రామీణుల వరకు రీల్స్పైనే ఆధారం
మెటా సర్వేలో వెల్లడి
సోషల్ మీడియా రీల్స్. ప్రస్తుతం దేశాన్ని కమ్మేస్తున్న మేనియా ఇదే. కుర్రకారు నుంచి వృద్ధుల వరకూ చేతిలో స్మార్ట్ ఫోన్.. ఫోన్లో రీల్స్ను స్క్రోల్ చేయడం సర్వ సాధారణ మైపోయింది. భారతీయ మార్కెట్ను సైతం రీల్స్ ప్రభావితం చేస్తున్నాయి. మార్కెట్లోకి వస్తున్న కొత్త ఉత్పత్తుల సమాచారం తెలుసుకునేందుకు.. వివిధ ఉత్పత్తులతో సరిపోల్చేందుకు.. ఏ ఉత్పత్తిని కొనుగోలు చేయాలో నిర్ణయించుకునేందుకు కూడా సగటు భారతీయులు రీల్స్పైనే ఆధార పడుతున్నారు.
ప్రధానంగా జెన్జీ తరం సోషల్ మీడియా రీల్స్ ప్రభావితం చేస్తున్నాయి. నగరాలు, పట్టణ ప్రాంతాల్లోనే కాదు గ్రామీణ ప్రాంతాలను సైతం రీల్స్ మేనియా ప్రభావితం చేస్తోందని మెటా తాజా సర్వే వెల్లడించింది. ప్రధానంగా కాస్మొటిక్స్, ఫ్యాషన్, ఫిట్నెస్, క్రీడలు, ఇతర యాక్ససరీస్ ఉత్పత్తుల విక్రయాలను సోషల్ మీడియా రీల్స్ ప్రభావితం చేస్తున్నాయి.
రీల్స్ చూడాలి.. తరువాతే కొనాలి
⇒ జెన్జీ తరంలో 81 శాతం మంది కొత్త ఉత్పత్తుల గురించి రీల్స్ ద్వారానే తెలుసుకుంటామన్నారు. వాటిలో 66 శాతం ఉత్పత్తులను పరిగణనలోకి తీసుకుంటున్నామని.. 47 శాతం ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నామని చెప్పారు.
⇒ 76 శాతం మంది మహిళలు తమ కొనుగోలు నిర్ణయాలను రీల్స్ ప్రభావితం చేస్తున్నాయన్నారు.
⇒ గ్రామీణ ప్రాంతాల ఖాతాదారుల్లో 76 శాతం మంది ఆర్థిక విషయాలపై సలహాలు, సూచనలు తెలుసుకునేందుకు రీల్స్పై ఆధారపడుతున్నారు.
‘మెటా’ ఏం తేల్చిందంటే..
⇒ ‘మెటా ఇంపోసోస్ –2026’ పేరిట విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ రోజుకు ఒక్కసారైన రీల్స్ చూడాల్సిందే
⇒ భారత్లో మెటా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఖాతాదారుల్లో 90 శాతం మంది రీల్స్ను చూస్తున్నారు. అతి తక్కువ నిడివి గల వీడియోలను వీక్షించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
⇒ జెన్జీ తరానికి చెందిన వారిలో 98 శాతం మంది తాము రోజుకు ఒక్కసారైనా రీల్స్ చూస్తున్నట్టు చెప్పారు.
⇒ మెటా ఖాతాదారులైన మహిళల్లో 96 శాతం మంది రోజుకు ఒక్కసారైన రీల్స్ చూస్తామన్నారు.
⇒ అధిక ఆదాయం కలిగిన వర్గాల్లో 88 శాతం మంది తాము రోజుకు ఒక్కసారైనా రీల్స్ చూస్తామన్నారు.


