సెప్టెంబర్ 1 నుంచి ఆందోళన కార్యక్రమాలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వేయి రోజులు పూర్తయినా ఎన్నికల హామీలను నెర వేర్చకపోవడంపై బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. తెలంగాణభవన్లో గురువారం బీఆర్ఎస్ చేపట్టే నిరసన కార్యక్రమాల షెడ్యూల్ను మాజీ మంత్రి నిరంజన్రెడ్డి ప్రకటించారు.
⇒ సెప్టెంబర్ 1న తెలంగాణ భవన్లో నిరసన కార్యక్రమాల లోగో ఆవిష్కరణ అనంతరం ఏడు రోజుల పాటు నిర్వహించే నిరసన కార్యక్రమాలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం.
⇒ సెప్టెంబర్ 2న ఆయా గ్రామాల్లో వైఫల్యాలపై ప్రచారం, నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు, బైక్ ర్యాలీలు, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపై ప్రజలకు వివరణ.
⇒ 3న రైతు సభల ద్వారా వ్యవసాయం, నీటి పారుదల రంగం, విద్యుత్, యూరియా, రైతు బీమాకు సంబంధించిన సమస్యలను రైతుల దృష్టికి తీసుకెళ్తారు. హైదరాబాద్, అర్బన్ ఏరియాల్లో 22ఏ నిషేధిత భూముల కోసం ధర్నాలు.
⇒ 4న విద్యార్థులు, వికలాంగులు, మహిళలతో నిరసనలు. మహిళలకు రూ.2,500, కేజీ టు పీజీ, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ తదితర హామీల అమలుపై విద్యార్థులు, మహిళలకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తారు.
⇒ 5న విద్యార్థులు, యువత ఆధ్వర్యంలో నిరసనలు. ఫీజు రీయింబర్స్మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ అమలుపై నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు.
⇒ 6న ఆదిలాబాద్, సిరిసిల్ల నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆదిలాబాద్లో ఏసీసీ, సింగరేణి ప్రాంతాల్లో 12 నియోజకవర్గాల నుంచి నిరసన సభలు. హైదరాబాద్లో తాగునీరు, విద్యుత్ దీపాలు, శాంతిభద్రతలు, ట్రాఫిక్, బస్తీ దవాఖానాలు తదితర అంశాలపై ఆందోళన కార్యక్రమాలు. మిగిలిన తెలంగాణ నియోజకవర్గాల్లో పల్లెల విద్యుత్, పడకేసిన పారిశ్రామిక విధానంపై నిరసనగా గ్రామాల్లో కార్యక్రమాలు
⇒ 7న జిల్లాలు, మండలాల్లోని ప్రజావాణిలో 420 హామీల అమలుపై వినతిపత్రాల సమర్పణ.
⇒ 8న జిల్లా కేంద్రాల్లో ఏడు రోజుల కార్యక్రమాలపై ప్రెస్మీట్ నిర్వహించి జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాల సమర్పణ.
⇒ సెప్టెంబర్ 10న ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాల నిరసన కార్యక్రమాలకు సంఘీభావం.


