న్యూఢిల్లీ: మానసిక సమస్యలు, స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్న తన 38 ఏళ్ల కుమారుడిని ఓ తండ్రి తన స్నేహితుడితో కలిసి దారుణంగా హతమార్చిన సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి 64 ఏళ్ల నిందితుడితో పాటు అతడికి సహకరించిన 49 ఏళ్ల వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. దక్షిణ ఢిల్లీలోని కాళింది కుంజ్ వద్ద ఢిల్లీ-ముంబయి ఎక్స్ప్రెస్వే సమీపంలో పాడుబడిన షిప్పింగ్ కంటైనర్లో తీవ్ర గాయాలతో ఉన్న గుల్ హసన్ (38) మృతదేహాన్ని ఆగస్టు 23న ఉదయం గుర్తించినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్ఈస్ట్) వినీత్ కుమార్ తెలిపారు.
ఎన్టీపీసీ ప్రహరీ గోడ పక్కనే ఉన్న కంటైనర్లో రక్తం మడుగులో, తలకు బలమైన గాయంతో ఉన్న మృతదేహం కనిపించడంతో పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) కింద హత్య కేసు నమోదు చేశారు. ఏసీపీ అనిల్ కుమార్ శర్మ నేతృత్వంలో నాలుగు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. ఘటనా స్థలం పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, బాధితుడిని ఇద్దరు వ్యక్తులు ఘటనా స్థలానికి తీసుకెళ్లడం, ఆ తర్వాత వారు మాత్రమే ఒంటరిగా తిరిగి రావడం కనిపించింది.
ఆ ఆధారాలతో నిందితులను గోవింద్పురిలోని ఓ టైలరింగ్ ఫ్యాక్టరీ వద్ద గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వైద్యుడి వద్దకు తీసుకెళ్తున్నామని నమ్మించి బాధితుడిని నిర్జన ప్రదేశంలోని కంటైనర్ వద్దకు తీసుకెళ్లినట్లు విచారణలో తేలింది. అక్కడ మొదట రాయి లేదా బండతో తలపై బలంగా కొట్టి, అనంతరం గొంతు నులిమి హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారు. పోస్ట్మార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని, హత్యకు గల పూర్తి కారణాలు, ఘటన క్రమాన్ని తెలుసుకునేందుకు నిందితులను విచారిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: భారత డీఎన్ఏలోనే ఏకత్వం: న్యూయార్క్లో మోహన్ భగవత్


