బార్ కౌన్సిళ్లపై జస్టిస్ నాగరత్న వ్యాఖ్య
న్యూఢిల్లీ: పెండింగ్ కేసులు, విచారణలో జాప్యం, పెరుగుతున్న ఖర్చులతో భారత న్యాయవ్యవస్థ సతమతమవుతోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి.నాగరత్న ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాద సంఘాలు (బార్ కౌన్సిళ్లు) తమ ఆలోచన ధోరణిని మార్చుకుని న్యాయ వితరణను సుస్థిరం చేసేందుకు ముక్తకంఠంతో మాట్లాడాలని పిలుపునిచ్చారు.
శనివారం ఢిల్లీ నేషనల్ లా యూనివర్సిటీ (ఎన్ఎల్యూ) 13వ స్నాతకోత్సవంలో జస్టిస్ నాగరత్న, మాట్లాడుతూ బార్ కౌన్సిళ్లు సభ్యుల గౌరవం పొందకపోవడం న్యాయ వ్యవస్థకు శుభసూచకం కాదని అన్నారు. అందువల్ల వృత్తిపరమైన నైతిక ప్రమాణాలను కాపాడటం, నైపుణ్య పరిరక్షణల్లో తమ పాత్ర ఏమిటన్న అంశంపై బార్ కౌన్సిళ్లు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు.
దేశంలో రాజ్యాంగ విలువలను కాపాడేవారు న్యాయవాదులేనని, బార్ కౌన్సిల్లోని లోపాలు, చేసే తప్పులు దేశ రాజకీయ, పౌర జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతుంది కాబట్టే సమాజంలో వారి ప్రాధాన్యత ఏర్పడిందని చెప్పారు. బార్ సభ్యులు ప్రతి ఒక్కరూ తమ ఆలోచనా ధోరణిని మార్చుకొని, కక్షిదారుల సేవను ప్రజాసేవగా భావించాలని గుర్తు చేశారు.
లేదంటే భవిష్యత్తులో న్యాయవాదులు తమ ప్రాముఖ్యతను కోల్పోయే ప్రమాదముందని హెచ్చరించారు. చట్టాలను కాపాడేందుకు న్యాయవాదులు తమ జ్ఞానం, వివేచనలను ఉపయోగించాలని సూచించారు. న్యాయవాదులు ప్రజాస్వామ్య వ్యవస్థలకు ‘‘సేఫ్టీ వాల్్వలు’’ అని అభివర్ణించిన జస్టిస్ నాగరత్న, బార్ స్వతంత్రత అనేది న్యాయవాదుల వ్యక్తిగత ప్రయోజనం కోసం ఇచి్చన హక్కు కాదని స్పష్టం చేశారు.


