బీసీఐ చైర్మన్‌ మనన్‌ దిగిపోవాలి | Bar Council co-chairman asks chief to resign, flags Rs 150-crore irregularities | Sakshi
Sakshi News home page

బీసీఐ చైర్మన్‌ మనన్‌ దిగిపోవాలి

Aug 23 2026 6:33 AM | Updated on Aug 23 2026 6:33 AM

Bar Council co-chairman asks chief to resign, flags Rs 150-crore irregularities

ఆయన హయాంలో రూ.150 కోట్ల నిధుల మళ్లింపు

కో చైర్మన్‌ సదాశివరెడ్డి విమర్శ

సాక్షి, న్యూఢిల్లీ: బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(బీసీఐ) చైర్మన్‌ మనన్‌ మిశ్రా తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని బీసీఐ కో–చైర్మన్, సీనియర్‌ న్యాయవాది వైఆర్‌ సదాశివరెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మిశ్రాకు శనివారం ఆయన ఒక ఘాటు లేఖ రాశారు. 15 రోజుల్లోగా చైర్మన్‌ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు. నిధుల మళ్లింపు, అక్రమ నియామకాలు, అధికార దుర్వినియోగం సహా 8 ప్రధాన కారణాలను ప్రస్తావిస్తూ మనన్‌ రాజీనామాకు సదాశివరెడ్డి పట్టుబట్టారు. బీసీఐ ఖాతాలతో పాటు ఆయన హయాంలో ఏర్పాటైన ట్రస్ట్‌ ఖాతాలపై స్వతంత్ర ఆడిట్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. 

ఆరోపణలపై చర్చించేందుకు కౌన్సిల్‌ను అత్యవసరంగా సమావేశ పరచాలని కోరారు. హైదరాబాద్‌లోని నల్సా ర్‌ న్యాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవా నికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ హాజరుకావడాన్ని తప్పుబట్టిన విద్యార్థులను మనన్‌ మిశ్రా బెదిరించడాన్ని సదాశివరెడ్డి తప్పుబట్టారు. మిశ్రా తన పదవీకాలంలో 2020లో ’బీసీఐ ట్రస్ట్‌ పెర్ల్‌– ఫస్ట్‌’ పేరిట తనకు కావలసిన వారితో ఒక కొత్త ట్రస్టును ఏర్పాటు చేశారని సదాశివరెడ్డి ఆరోపించారు. 

కౌన్సిల్‌ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ బీసీఐ నిధుల నుంచి దాదాపు రూ.150 కోట్లను ఆ ట్రస్టుకు మళ్లించారన్నారు. బీసీఐ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థల్లో కీలక పరిపాలనా పోస్టులన్నీ మిశ్రా బంధువుల చేతుల్లోనే ఉన్నాయని గుర్తుచేశారు. ఏమాత్రం అర్హత లేని కాలేజీలకు అనుమతులు ఇవ్వడంతో న్యాయ విద్యలో నాణ్యత పడిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2012 నుంచి వరుసగా 14 ఏళ్లకు పైగా మిశ్రా చైర్మన్‌ పదవిలో కొనసాగడం పార్లమెంటు ఉద్దేశించిన రొటేషనల్‌ విధానానికి విరుద్ధమని పేర్కొన్నారు.

ఆరోపణలను ఖండించిన మనన్‌
తనపై వచ్చిన ఆరోపణలను మనన్‌ ఖండించారు. ‘‘ఆరోపణలు గుప్పిస్తున్న సదాశివరెడ్డి బీసీఐలో ప్రస్తుతం సభ్యుడు కాడు. సొంత రాష్ట్రం కర్ణాటక నుంచి ఈసారి ఆయన పోటీచేయలేదు. గత ఎనిమిదేళ్లుగా బీసీఐ సభ్యునిగా ఉన్న కాలంలో చేయని ఆరోపణలు ఇప్పుడెందుకు చేస్తున్నట్లు? అయినా నేనెంత నిజాయతీపరుడినో బార్‌ కౌన్సిల్‌లో అందరికీ తెలుసు. పాతిక లక్షల మంది లాయర్ల మద్దతున్న నన్ను సోషల్‌మీడియాలో సదాశివరెడ్డి లాంటి వాళ్లు ఎంతో మంది విమర్శిస్తుంటారు’’ అని మనన్‌ వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement