అయోధ్య: రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మర్యాదా పురుషోత్తముడు శ్రీరాముని సోదరి శాంతా దేవి తరఫున దేశ ప్రముఖులకు రాఖీలు పంపనున్నారు. శృంగి రిషి సేవా సంస్థాన్ అధ్యక్షుడు సుభాష్ సింగ్ ఆధ్వర్యంలో ఈ సంప్రదాయం కొన్నేళ్లుగా కొనసాగుతోంది. సాకేత్ భవన్ మహంత్ సీతారాం దాస్ మహరాజ్ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణలు, శాస్త్రోక్త విధివిధానాలతో ఈ రాఖీలన్నింటికీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అరటి నారతో ఈ ప్రత్యేక రాఖీలను తయారు చేయడం విశేషం.
రాష్ట్రపతి నుంచి ముఖ్యమంత్రి వరకు..
శాంతా దేవి తరఫున పంపుతున్న ఈ రాఖీలను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులకు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ రాఖీలు మార్కెట్లో లభించే సాధారణమైనవి కాదు. వీటిని సహజసిద్ధమైన నార తీసుకుని, చేతితో వీటిని రూపొందించారు. ఇది భారతీయ సంస్కృతిలోని పవిత్రతకు, పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా నిలుస్తున్నది.
శాంతా దేవి నేపథ్యం
ధార్మిక విశ్వాసాల ప్రకారం.. శాంతా దేవి దశరథ మహారాజు కుమార్తె, శ్రీరామునికి స్వయానా సోదరి. ఆమె వివాహం మహర్షి శృంగి రిషితో జరిగింది. అప్పటి నుంచే అక్కాతమ్ముళ్ల ఈ అనుబంధ సంప్రదాయం కొనసాగుతోందని ప్రతీతి. అయోధ్యలోని రామ్లల్లా దర్బారులో శ్రీరాముడికి కూడా శాంతా దేవి తరఫున ఈ ప్రత్యేక రక్షా సూత్రాన్ని సమర్పించనున్నారు.
ఇది కూడా చదవండి: గురుద్వారాలో స్క్రూడ్రైవర్తో దాడి.. ఇద్దరికి గాయాలు


