కూతురు -అల్లుడి మధ్య స్వల్ప వివాదం
టెకీని దారుణంగా హత్య చేసిన అత్తింటివారు
సాక్షి,న్యూఢిల్లీ: భార్యతో జరిగిన తీవ్ర వాగ్వాదం ఒక యువ టెకీని బలితీసుకుంది. ఈ ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడికి తన భార్యతో ఇంట్లో వచ్చిన వివాదంలో కుటుంబ సభ్యులు జోక్యం చేసుకోవడంతో అది తీవ్రరూపం దాల్చింది. వీరి దాడిలో 31 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణంగా హత్యకు గురైన సంఘటన ఢిల్లీలోని నిహాల్ విహార్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
ప్రాథమిక పోలీసు విచారణ ప్రకారం మృతుడిని లక్ష్మీ పార్క్ నివాసి, నోయిడాలోని 'అడోబ్' (Adobe) సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న వినయ్ గుప్తా (31)గా గుర్తించారు. కాగా వినయ్కి మూడేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు నాలుగున్నర నెలల వయసున్న కవల పిల్లలు (ఒక బాబు, ఒక పాప) ఉన్నారు.
ఏం జరిగింది?
ఉదయం దంపతుల మధ్య కుటుంబ విషయమై గొడవ జరిగింది. దీంతో భార్య తన పుట్టింటి వారికి సమాచారం అందించగా, వారు నిహాల్ విహార్లోని వినయ్ నివాసానికి చేరుకున్నారు. ఇంటికి వచ్చిన విజిటర్స్ కోసం నీళ్లు, అల్పాహారం తీసుకురావడానికి వినయ్ తల్లి బయటకు వెళ్లిన సమయంలో, భార్య తరఫు బంధువులు ఆయనపై విచక్షణారహితంగా దాడి చేశారు. తల్లి వచ్చి అడ్డుపడి, ఆపమని బ్రతిమాలినా వినకుండా దాడిని కొనసాగించారు. వీరి దాడిలో తీవ్రంగా గాయపడిన వినయ్ను ఆస్పత్రికి తరలించగా, అతడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
ఇదీ చదవండి: కొడుకు ఎంత చెప్పినా వినలేదు, చివరికి తల్లి కూడా !
మృతుడి భార్యతో పాటు మరో ఆరేడుగురిపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి ఫోరెన్సిక్ బృందం చేరుకుని ఆధారాలు సేకరించింది. ఈ కేసులో నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
ఇదీ చదవండి: 14 ఏళ్లకే సోషల్ మీడియాలో సంచలనం ఎవరీ ‘ఏలియన్ స్టార్’


