జెన్ జెడ్కు చేరువయ్యే కార్యక్రమాలపై బీజేపీ దృష్టి
యువ మోర్చా నేతలు, యువ ఎంపీలతో పార్టీ చీఫ్ భేటీ
యూపీ, పంజాబ్ సహా ఏడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపైనా చర్చ
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, పంజాబ్ సహా ఏడు రాష్ట్రాల అసెంబ్లీలకు మరికొద్ది నెలల్లో జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని యువతకు మరింత చేరువయ్యేలా కార్యక్రమాలు చేపట్టేందుకు బీజేపీ రంగం సిద్ధం చేస్తోంది. యువత ఎదుర్కొంటున్న సమస్యలు, ఆకాంక్షలను మరింత లోతుగా అర్థం చేసుకుని వారితో అనుసంధానాన్ని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ అంశమై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన శనివారం పార్టీ ప్రధాన కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. దేశవ్యాప్తంగా యువత ఎదుర్కొంటున్న సవాళ్లు, యువతతో పార్టీ కమ్యూనికేషన్ను మరింత పటిష్టం చేసే వ్యూహాలను ఇందులో ప్రముఖంగా చర్చించారు.
దీర్ఘకాలిక అభివృద్ధే అజెండా
ఢిల్లీలో శనివారం జరిగిన సమావేశంలో కొత్తగా నియ మితులైన బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు హేమంగ్ జోషితో పాటు మాజీ యువమోర్చా అధ్యక్షులు అను రాగ్ ఠాకూర్, పూనమ్ మహాజన్, తేజస్వీ సూర్య పాల్గొన్నారు. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్మృతీ ఇరానీ, గుజరాత్ ఉపముఖ్యమంత్రి హర్‡్ష సంఘవి, ఛత్తీస్గఢ్ ఉపముఖ్యమంత్రి విజయ్ శర్మ, ఎంపీలు రవి కిషన్, కమలేశ్ పాశ్వాన్, గురు ప్రకాశ్, యోగేంద్ర చందోలియా, రాజు బిస్తా పాల్గొన్నారు. యువతకు పార్టీని చేరువగా తీసుకెళ్లడం, చర్చలు, అనుసంధానాన్ని మెరుగుపరిచే వ్యూహాలపై వీరు చర్చించారు.
సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడం, దీర్ఘకాలిక అభివృద్ధిని ప్రధాన అజెండాగా ముందుకు తీసుకెళ్లడం వంటి అంశాల పై వారికి నితిన్ నబీన్ దిశానిర్దేశం చేశారు. సామాజిక మాధ్యమాలు, ఆధునిక కమ్యూనికేషన్ మార్గాలను విస్తృతంగా ఉపయోగించుకుని యువతతో మమేకం కావాలని సూచించినట్లు సమాచారం. యువత సమస్యలు, ఆకాంక్షలను తెలుసుకుని వాటిపై పార్టీ స్పందించే విధానాన్ని మరింత బలోపేతం చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వాస్తవంగా ప్రజలకు చేరుతున్నాయా లేదా అన్నది యువ నాయకత్వం క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలని నబీన్ సూచించారు.
ప్రభుత్వం–ప్రజల మధ్య పార్టీ వారధిగా వ్యవహరించాలని, ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించి అవసరమైన చోట ప్రభుత్వానికి చేరవేయాలని దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కంటే దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలని యువ నేతలకు నబీన్ స్పష్టం చేసినట్లు సమాచారం. ప్రజల్లో పార్టీపై విశ్వాసాన్ని పెంచేలా నిరంతరం క్షేత్రస్థాయిలో పనిచేయాలని నేతలకు సూచించారు. రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు స్పందించే విషయంలో పార్టీ నాయకులు సంయమనం, క్రమశిక్షణ పాటించాలని నబీన్ సూచించినట్లు సమాచారం. సంస్థాగత గౌరవాన్ని కాపాడుతూ వాస్తవాలు, క్రమబద్ధమైన వాదనల తో రాజకీయ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని యువ నేతలకు ఆయన మార్గనిర్దేశం చేసినటుŠల్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.


