కాంగ్రెస్ అధ్యక్షుడికి న్యాయం చేయాలి
ఎస్టీ/ఎస్టీ చట్టం కింద కేసు పెట్టాలి
బీజేపీ–ఆర్ఎస్ఎస్లు
అంటరాతనం పాటిస్తున్నాయి
అంటరానితనం శిక్షార్హమైన నేరం
దళితులపట్ల అడుగడుగునా వివక్ష
రాహుల్ గాంధీ ధ్వజం
న్యూఢిల్లీ: ‘శుద్దీకరణ’వివాదంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీ లక్ష్యంగా విమర్శలకు దిగారు. కొన్ని రోజుల క్రితం ఉత్తరాఖండ్లోని హల్ద్వానీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగించిన వేదికను భారతీయ జనతా పార్టీ నేతలు శుద్ధి చేయడంపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.
ఆ ఘటన ఒక నేరమని, ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యులపై ఎస్సీ/ఎస్టీ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదయ్యేలా చూడాలని రాహుల్ గాంధీ శనివారం డిమాండ్ చేశారు. దళితులు బాగుంటే ఓర్చుకోలేని బీజేపీ–ఆర్ఎస్ఎస్ మనస్తత్వం ఇదని ఆయన న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ధ్వజమెత్తారు. నేరం జరిగి 20 రోజులు అవుతున్నా ఇప్పటివరకూ ఎలాంటి చర్య తీసుకోలేదని ఎత్తి చూపారు.
‘‘కాంగ్రెస్ అధ్యక్షుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ అధ్యక్షుడికి న్యాయం కల్పించండి. న్యాయ దక్కేలా చేయడం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత.’’అని రాహుల్ వ్యాఖ్యానించారు. బీజేపీ ఉత్తరాఖండ్ విభాగం అధ్యక్షుడు మహేంద్ర భట్ ‘శుద్ధీకరణ’ను సమర్థించుకున్నారని ఆరోపించిన రాహుల్.. ఆ ‘‘ఆ పని (శుద్ధీకరణ) చేసిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నది మా డిమాండ్.
ప్రధాని నరేంద్ర మోదీ తాను అన్ని కులాలకు చెందిన వాడినని, దేశానికి ప్రధానిని అని చెబుతూంటారు. కానీ ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడు మాత్రం శుద్ధీకరణను సమర్థించుకుంటున్నారు’’అని విమర్శించారు. శుద్దీకరణ చేసింది ఆర్ఎస్ఎస్ వాళ్లని, వారిపై ఎస్సీ/ఎస్టీ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ప్రధాని ఆదేశించాలని రాహుల్ డిమాండ్ చేశారు.
‘‘హల్ద్వానీలో ఖర్గే ర్యాలీ జరిగిన రెండు రోజులకు ఆగస్టు పదవ తేదీన వాళ్లు శుద్దీకరణ చేశారు. ఇది నేరం. ఆగస్టు 13న ఖర్గే ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తారు’’అని గుర్తు చేశారు. ‘‘రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధమిది. రాజ్యాంగాన్ని అందించిన బీఆర్ అంబేద్కర్ లాంటి వారు, మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూలు ఒకపక్కన ఉంటే బీజేపీ–ఆర్ఎస్ఎస్ ఇంకోపక్కన ఉన్నాయి’’ అని అన్నారు.
దళితులపై వేల ఏళ్లుగా హింస
దళితులపై వేల ఏళ్లుగా హింస జరుగుతోందని, రాజ్యాంగం ప్రకారం ఇది అక్రమమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈనాటికి కూడా దళిత బిడ్డలతో పాఠశాలల్లో మరుగుదొడ్లు శుభ్రం చేయిస్తున్నారని, ఇదీ ఈ దేశపు వాస్తవం అని రాహుల్ ఆరోపించారు. దళితులు బావుల్లోంచి నీరు తాగకుండా, టీకొట్లలో రెండు గ్లాసుల పద్ధతి పాటిస్తున్నారని ఒకటి దళితులకు, ఇంకోటి ఇతరులకు ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.
దళిత వరుడు గుర్రంపై ఊరేగుతూ ఎక్కడ తనను కొడతారో అన్న భయంతో హెల్మెట్ ధరించాల్సిన భారత్లో ఉన్నామని చెప్పారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జు ఖర్గే మాత్రమే కాకుండా రాజస్థాన్ నేత తికారామ్ జుల్లి, ఎన్డీయే మంత్రి జీతన్ రామ్ మాంఝీలు కూడా పలు సందర్భాల్లో శుద్దీకరణ అవమానాన్ని ఎదుర్కొన్నట్లు తెలిపారని రాహుల్ వివరించారు. దళితులు ఎంత సక్సెస్ సాధిస్తే అతడిపై దాడులు అంత తీవ్రంగా ఎక్కువవుతాయని ఆరోపించారు. ‘‘ఇది అంటరానితనానికి మరోపేరు’’అని చెప్పారు.


