శుక్ర, శనివారాల్లో స్వస్థలాలకు చేరిన నేపాల్ వరద బాధితులు
అక్కడ మొత్తం చిక్కుకున్న వారిలో 68 మంది ఏపీ వాసులు
ఇంకా 13 మంది ఆచూకీ కోసం అన్వేషణ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రకృతి విలయానికి అతలాకుతలమైన నేపాల్లో చిక్కుకున్న మొత్తం 68 మంది ఏపీ వాసుల్లో ఇప్పటివరకు 28 మంది సురక్షితంగా స్వస్థలాలకు చేరారు. ఇంకా 13 మంది జాడ తెలీకపోవడంతో.. వారి ఆచూకీ కోసం అక్కడి అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వీరంతా మానస సరోవర్ యాత్ర, ట్రెక్కింగ్ కోసం వెళ్లిన వారే కావడం గమనార్హం. ఇందులో కొందరు విదేశాల్లో స్థిరపడ్డారు. దీంతో మిగిలిన వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.
‘సైన్ ఇన్ ట్రావెల్స్’ ఆధ్వర్యంలో మానస సరోవర్ యాత్రకు వెళ్లిన సుమారు 28 మంది అక్కడ వరదల్లో చిక్కుకున్నారు. భారీగా వరదలు వ్యాపించడంతో వీరి కళ్ళెదుటే ఎంతోమంది మృత్యువాతపడ్డారు. అయితే, వీరందరూ శుక్రవారం రాత్రి, శనివారం మధ్యాహ్నానికి పలు గ్రూపులుగా హైదరాబాద్, విజయవాడ చేరుకున్నారు. కళ్లేదుటే ఘోరం జరిగినా ఎవరినీ రక్షించలేని, ఎవరికీ సహాయపడలేని స్థితిలో ఉన్నామంటూ వారు ఆవేదన వ్యక్తంచేశారు. ఇక ఆచూకీ లభించని 13 మంది అన్నమదేవర వెంకట్రామ్, అన్నమదేవర అనఘ, చొప్పరపు రమేశ్బాబు, సంతోష్ సాహు, స్పందన్ సాహు, పాధ్య సురభి మన్మథ, సైనా కుమారి సాహు, వీఎల్ బాలసుబ్రహ్మణ్యం, అట్లూరి శశికుమార్, నిమ్మగడ్డ రాజ్య లక్షి్మ, కె. గోవింద్, సుహాసిని రెడ్డి కందిమల్ల, రంగనాథ్లుగా గుర్తించారు.
భాస్కర్ శాస్త్రి కుటుంబం క్షేమం..
మరోవైపు.. అక్కడ చిక్కుకున్న వారిలో కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన భాస్కర్శాస్త్రి, మణి శారద, రఘునాథ శాస్త్రి, హన్షిక కూడా సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. అయితే, రఘునాథ శాస్త్రికి తీవ్రమైన పల్మనరీ ఎడిమా (ఊపిరితిత్తుల్లో ద్రవం చేరడం) ఏర్పడడంతో ఆ కుటుంబం శుక్రవారం సాగా చేరుకుని హోటల్లో బసచేసింది. అక్కడ ఆక్సిజన్ సదుపాయం ఏర్పాటుచేశారు. శనివారం వారు న్యాలమ్ కౌంటీకి చేరుకున్నారు.
సరిహద్దు, వాతావరణం, రహదారి పరిస్థితులను బట్టి కోడారి మీదుగా కాఠ్మాండు చేరేందుకు వారు ప్రయతి్నస్తున్నారు. వీరి కుటుంబం ఆది లేదా సోమవారం కాఠ్మాండు చేరుకునే అవకాశముంది. సెప్టెంబర్ 1న కాఠ్మాండు–ముంబై–హైదరాబాద్ విమాన ప్రయా ణం ఖరారైనట్లు అధికారులు తెలిపారు.


