ఆశించిన మేర గోదావరికి చేరని ఎర్ర నీరు
దీంతో అటువైపు చూడని జలపుష్పం
సీజన్ ముగుస్తున్నా కానరాని జాడ
ఇప్పటి వరకు కేవలం నాలుగు పులసలే లభ్యం
మత్స్యకారుల ఉపాధిపై తీవ్ర ప్రభావం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘పుస్తెలు అమ్మయినా పులస పులుసు తినాల్సిందే’.. అన్నది గోదావరితో పాటు ఇతర ప్రాంత వాసుల నానుడి. పోషక విలువలు, జిహ్వకు రుచి దీనికి కారణం. ఏటా జూలై, ఆగస్టు నెలల్లో గోదావరికి వరదలు పోటెత్తేవి. జీవనదిలోకి ఎర్రటి నీరు భారీగా చేరేది. గోదాట్లో నీరు ఎరుపెక్కిందంటే ఇంకేముంది.. పులస వేటకు మత్స్యకారులు పోటెత్తేవారు. గోదావరి ప్రవాహానికి ఎదురీదుతూ ఏడాదికి ఒకసారి మాత్రమే లభ్యమయ్యే పులస కోసం యానాం, ఎదుర్లంక, ధవళేశ్వరం, రావులపాలెం, సిద్ధాంతం, నరసాపురం తదితర గోదావరి ప్రాంతాల్లో కోలాహలం ఉండేది. వేలం పాటలతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొనేది. ముందస్తుగా అడ్వాన్సులు ఇచ్చిమరీ చేపను ఇంటికి తీసుకువెళ్లేవారు.
ఇదంతా గతం. ఇప్పుడు ఎల్నినో ప్రభావంతో వర్షం జాడ లేదు. దీంతో భారీ వరద నెమ్మదించింది. ఈ పరిణామం మత్స్యకారుల ఉపాధిని దెబ్బ తీసింది. ప్రస్తుత సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు యానాంలో మూడు, కోటిపల్లిలో ఒకటి చొప్పున నాలుగు పులసలు మాత్రమే లభ్యంకావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. వాతావరణ పరిస్థితుల వల్ల బంగాళాఖాతం నుంచి పులస గోదావరిలోకి రాకుండా ఒడిశా, పశ్చిమబెంగాల్ వైపు పయనిస్తోందని మత్స్య శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. కృష్ణా, గోదావరి (కేజీబేసిన్)లో చమురు కార్యకలాపాల్లో భాగంగా చేపడుతున్న డ్రెడ్జింగ్తో ధ్వని కాలుష్యం పెరిగిపోవడం కూడా పులసలు గోదావరిలోకి రాకపోవడానికి కారణమన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి.


